రాజ్యసభలో జశోదాబెన్ 'ఆర్టీఐ దరఖాస్తు'.. మాట్లాడేందుకు అనుమతి నిరాకరణ
జశోదాబెన్ పేరు ఎత్తగానే దీనిపై మాట్లాడేందుకు అనుమతించబోనని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాన మంత్రి భార్యగా నిబంధనల ప్రకారం తనకు ఏ స్థాయి భద్రత కల్పించాలి, ప్రస్తుతం ఎంతమేరకు భద్రత కల్పించారని అడుగుతూ సోమవారం ఆమె సమాచార హక్కు చట్టం కింద గుజరాత్లోని మెహసానా జిల్లా పోలీసులకు దరఖాస్తు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన యాక్చువల్ ఆర్డర్ ధ్రువీకృత కాపీ సహా పలు పత్రాలను తనకు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. తన గార్డులు కార్ల వంటి ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తుండగా, ప్రధాని భార్యనై ఉండీ తాను బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణిస్తున్నానని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె గార్డులే.. పైగా ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే కాల్చి చంపారని జశోదా బెన్ గుర్తు చేశారు. తన గార్డుల పట్ల కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. తన భద్రత కోసం నియోగించే గార్డుల నియామక పత్రాన్ని తనకు సమర్పించడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. జశోదాబెన్ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన విషయాన్ని మెహసానా ఎస్పీ జేఆర్ మొథాలియా ధ్రువీకరించారు.
సోమవారం ఆమె మా కార్యాలయానికి వచ్చారని, ప్రధాని భార్యగా తనకు ఎలాంటి భద్రత కల్పించారో తెలపాల్సిందిగా కోరుతూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు దాఖలు చేశారని, ఆమెకు మేం నిర్ణీత సమయంలో సమాధానం ఇస్తామని ఆయన వివరించారు.