ఎవర్ గ్రీన్.. గ్రీన్ సారీ: ఖననంలోను ఆకుపచ్చ చీరతోనే అమ్మ
అమ్మకు సంబంధించి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే విషయాల్లో.. గ్రీన్ సారీ (ఆకుపచ్చ చీర) ఒకటి. ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఇష్టపడే జయలలిత ఎక్కువగా ఆ రంగు చీరల్లోనే కనిపించేవారు.
చెన్నై: భుజం మీద నుంచి నిండుగా కప్పుకున్న చీర.. చేతికి బంగారు వాచీ.. ముఖంలో ప్రశాంతత.. తమిళ దివంగత సీఎం జయలలిత గుర్తుకురాగానే కళ్లముందు మెదిలే దృశ్యాలివి. తన వద్దనున్న వేలకొద్ది చీరలు, ఆభరణాలను బట్టి చూస్తే.. మిగతా ఆడవాళ్లలాగే జయలలిత కూడా వాటి పట్ల అమితమైన ఇష్టాన్ని పెంచుకున్నట్టుగా చెప్పుకోవచ్చు.
వీటి సంగతెలా ఉన్నా.. అమ్మకు సంబంధించి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే విషయాల్లో.. గ్రీన్ సారీ (ఆకుపచ్చ చీర) ఒకటి. ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఇష్టపడే జయలలిత ఎక్కువగా ఆ రంగు చీరల్లోనే కనిపించేవారు. చివరికి ఆమెను ఖననం చేసిన సందర్బంలోను ఆమె ఆకుపచ్చ చీరలోనే ఉండడం గమనార్హం.
Photos : అమ్మకు ప్రముఖుల నివాళి
జయ ఎంతో ఇష్టంగా చేయించుకున్న బంగారు గాజులు, ఆమె బంగారు వాచీ కూడా ఆమెతో పాటే ఖననమైపోయాయి. బంగారు గాజులు, వాచీ ఎప్పుడూ ఆమె చేతుల్ని అంటిపెట్టుకునే ఉండేవి. ఖననం సందర్బంలో.. నెచ్చెలి శశికళకు తెలిసే.. వీటిని తీయకుండానే జయలలితను ఖననం చేసినట్టుగా తెలుస్తోంది.
అమ్మ అమితంగా ఇష్టపడిన వాటిలో గులాబీ పూలు కూడా ఉన్నాయి. గులాబీ పూలతో కూడిన బొకేలు ఎవరైనా ఇచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగే సంబరపడిపోయేది. ఆకుపచ్చ రంగు, 2,5,6,9 సంఖ్యలు తనకు బాగా కలిసొచ్చేవని జయలలిత విశ్వసించేవారు. అందుకే ఆమె ఎక్కువగా ఆకుపచ్చ చీరను ధరించడానికే ఇష్టపడేవారని చెబుతుంటారు.
కాగా, తమిళనాడు సీఎం జయలలిత(68) సోమవారం రాత్రి 11.30గం.ల సమయంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. 74రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె కన్నుమూశారు. ప్రస్తుతం తమిళ ప్రజలంతా అమ్మ లేని విషయాన్ని జీర్ణించుకోలేక ఆవేదన చెందుతున్నారు.