జయ ఆరోగ్యం క్లార్టీ లేదు: 'అపోలో' ట్వీట్ నుంచి.. ఎన్నో అనుమానాలు, ఆందోళన
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం పైన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి వైద్యుల నుంచి నాయకుల వరకు ఎవరి వద్ద నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధం: జయకు హార్ట్ అసిస్ట్ పరికరంతో ప్రత్యేక చికిత్స
జయలలిత ఆరోగ్యం పైన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తూ, అపోలో ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు.
గవర్నర్ వచ్చారు కానీ..
జయలలితకు గుండెపోటు వచ్చి అపోలోలోని సాధారణ వార్డు నుంచి ఐసీయూలోకి మార్చగానే ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు హుటాహుటిన ముంబై నుంచి చెన్నై వచ్చారు. అపోలో ఆసుపత్రికి వచ్చిన ఆయన పది నిమిషాలు వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజ్ భవన్ వెళ్లారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రిలోనే కేబినెట్ భేటీ
అమ్మ ఐసీయులో చికిత్స పొందుతుండటంతో.. నాయకులు, మంత్రులు ఆసుపత్రికి తరలి వచ్చారు. అితే, కేబినెట్ మంత్రులు ఆసుపత్రిలోనే కేబినెట్ భేటీ జరపడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
అపోలోతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి ఆర్మీ, పోలీస్
అపోలో ఆసుపత్రి వద్ద అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది. అపోలో వద్ద పోలీసు, పారామిలటరీ దళాలను మోహరించారు. తమిళనాడు వ్యాప్తంగా దళాలను మోహరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పోలీసు అధికారులను సోమవారం ఉదయం ఏడు గంటలకు వాహనాలతో, పూర్తి యూనిఫాంతో డ్యూటీకి రావాలని చెప్పడం, సెలవులు రద్దు చేయడం గమనార్హం.
మాట మాట్లాడని గవర్నర్, ఆర్మీ-పోలీస్ మోహరింపు: 24 గం.తర్వాతే అమ్మ ఆరోగ్యంపై..
పాఠశాలలు బంద్ తర్వాత..
జయకు గుండెపోటు నేపథ్యంలో తొలుత పాఠశాలలకు బంద్ ప్రకటించారు. ఆ తర్వాత లేదని మంత్రి ప్రకటించారు.
ప్రధాని వస్తారని ప్రచారం
జయకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో గవర్నర్ విద్యాసాగర రావు హుటాహుటిన చెన్నై వచ్చారు. ఇద్దరు కేంద్రమంత్రులు వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
బులెటిన్ విడుదల చేయకుండా ప్రార్థించాలన్న అపోలో వర్గాలు
జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో వర్గాలు ఆమె ఆరోగ్యం గురించి హెలిత్ బులెటిన్ విడుదల చేయకుండా ఆమె త్వరగా కోలుకోవాలని అందరు ప్రార్థించాలని ట్వీట్ చేసింది. ఇది అభిమానులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. లోపలకు వెళ్లి వస్తున్న నేతలు కూడా బయట ఏం చెప్పడం లేదు.
జయలలితకు గుండెపోటు, హుటాహుటిన చెన్నైకి గవర్నర్ విద్యాసాగర రావు
అంతా బాగుందన్నారు.. అంతలోనే గుండెపోటు
సెప్టెంబర్ 22వ తేదీన అపోలోలో చేరిన జయలలిత 72 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. గతంలో 11 సార్లు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కొద్ది రోజుల క్రితమే.. అమ్మ బాగున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందించారు. అంతేకాదుక, ఆదివారం మధ్యాహ్నం పార్టీ వర్గాలు అమ్మ బాగున్నారని ప్రకటించారు. ఇంతలోనే సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో ఐసీయులోకి తరలించారు.