'నోకియా'కు ఝలక్!: అక్కడే 'అమ్మ' మొబైల్స్ కోసం..
చెన్నై: తమిళనాడులో 'బ్రాండ్ అమ్మ' మానియా బాగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 'అమ్మ' పేరుతో క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్ తదితరాలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమ్మ మొబైల్ ఫోన్లు రావాలని కోరుకుంటున్నారు.
తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులోని నోకియా ప్లాంటు ఉద్యోగులు అమ్మ మొబైళ్లు రావాలని కోరుతున్నారు. ఇక్కడి నోకియా ప్లాంటు మూసేసేందుకు సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనిని ప్రభుత్వం టేకోవర్ చేసుకొని, అమ్మ ఫోన్లు రూపొందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఈ విషయమై తాము రాష్ట్ర ప్రభుత్వాధికారులను కలిసి ప్లాంటు టేకోవర్ చేసుకోవాల్సిందిగా కోరామని నోకియా ఇండియా కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, సీపీఎం ఎమ్మెల్యే సౌందర రాజన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం 700 రూపాయలకే ఫోన్లు తయారు చేయవచ్చునని, వాటిని చౌకధరల దుకాణాల ద్వారా గానీ లేక ఉచితంగా గాని ఇవ్వవచ్చునని చెప్పారు.
కాగా, ఈ ప్లాంట్లో నవంబర్ 1 నుంచి మొబైల్ తయారీని నిలిపివేయాలని ఫిన్లాండ్ టెలికాం సంస్థ నోకియా కొద్దిరోజుల క్రితం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మొబైల్ మార్కెట్ను శాసించిన నోకియాను సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో చెన్నై ప్లాంట్లో తయారైన మొబైల్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ ఈ నవంబర్ 1 వరకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నవంబర్ 1తో ముగుస్తుండగా, ఈ మేరకు సమాచారాన్ని నోకియాకు మైక్రోసాఫ్ట్ అందించింది. దీంతో ఇక చెన్నైలోని శ్రీపెరంబదూర్ ప్లాంట్ నుంచి మొబైల్ తయారీని ఆపేయాలని నోకియా నిర్ణయించుకుంది. ఇక్కడ 1,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.