పోయెస్లో ఎవరినీ కలిసేందుకు ఇష్టపడని జయలలిత!
చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుండి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోయెస్ గార్డెన్లో ఎవరు కూడా తనను కలిసేందుకు అనుమతించడం లేదని సమాచారం. ఆమె జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలను ఎవరిని కూడా కలవలేదు.
ఇప్పుడు జైలు నుండి విడుదలయ్యాక కూడా ఆమె ఎవరినీ కలవడం లేదని తెలుస్తోంది. కలిసేందుకు ఆమె ఇష్టపడటం లేదని సమాచారం. జైలు నుండి బయటకు వచ్చిన జయలలిత తన కోసం మరణించిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సాయం చేయనున్నారు. జయలలిత జైలుకు వెళ్లిన విషయం తెలిసి రాష్ట్రంలో పలువురు మృతి చెందారు.
కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. 193 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,93,000 చొప్పున జయలలిత నష్టపరిహారం అందజేయనున్నారు. సెప్టెంబర్ 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు జయ అభిమానులు తీవ్ర ఆవేదన, నిరాశతో చనిపోయారు.
కాగా, జయలలిత గత వారం జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూర్ విమానాశ్రయం నుంచి చార్టర్డ్ విమానాంలో ఆమె చెన్నై చేరుకున్నారు. శనివారం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జయలలిత బెంగళూర్లోని జైలు నుంచి చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. జయలలిత కోసం చెన్నై విమానాశ్రయం వద్ద అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూశారు. సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేశారు.
చెన్నై విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకం అన్నాడియంకె కార్యకర్తలు మానవహారం చేపట్టారు. భారీ వర్షాన్ని కూడా వారు లెక్క చేయలేదు. తమ అమ్మ విడుదలకు సంతోషించి ఆకాశం వర్షించిందని వారు సంబరపడిపోయారు. అంతకు ముందు జయలలిత విడుదలకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పూచీకత్తు తీసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ జయలలిత విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతిని కూడా జయలలిత తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. జయలలిత ప్రియసఖి శశికళ, ఆమె బంధవులు సుధాకరన్, ఎలవరసి కూడా ఆ షరతులు పూరించారు. జయలలితకు డిసెంబర్ 18వ తేదీ వరకు తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేసింది.