కార్యకర్తలకు ఆనందం: జయలలిత పూర్తిగా కోలుకున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అన్నాడీఎంకే వర్గాలు ఆదివారం నాడు తెలిపాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి జయలలిత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అన్నాడీఎంకే వర్గాలు ఆదివారం నాడు తెలిపాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నయాన్ ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. జయలలితకు ఫిజియోతెరపీ జరుగుతోందన్నారు.
జయలలిత
జయలలిత ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోందని ఇటు ఆసుపత్రి వర్గాలు, అటు పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు చెబుతున్నాయి. అపోలో ఆసుపత్రి చీఫ్ కూడా ఇటీవల అమ్మ ఆరోగ్యంపై మాట్లాడారు. ఆమె మాట్లాడుతోందని ఇటీవల వెల్లడించారు.
22వ తేదీ నుంచి ఆసుపత్రి వద్ద హడావుడి
జయలలిత సెప్టెంబర్ 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రి వద్ద పార్టీ కార్యకర్తల హడావుడి కనిపించింది. నేతలు ఆమెను పరామర్శించేందుకు వస్తుండటంతో ఆసుపత్రి వద్ద మరింత హడావుడి కనిపించేది.
హెల్త్ బులెటిన్తో ఊరట
జయలలిత ఆసుపత్రిలో ఉండటం, తొలుత హెల్త్ బులిటిన్ విడుదల చేయకపోవడంతో కార్యకర్తల్లో, ఇతర పార్టీ నేతల్లో ఆందోళన కనిపించింది. డీఎంకే అధినేత కరుణానిది.. జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కోలుకోవడంతో సంతోషం
ఆ తర్వాత జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వచ్చారు. క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. దాంతో హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. జయలలిత కోలుకొని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారనే వార్త పార్టీ వర్గాల్లో సంతోషాన్ని తెచ్చిపెట్టింది.