జయలలితే వద్దన్నారు, నిబంధనలు: చికిత్సపై అపోలో, పిటిషనర్ ట్విస్ట్
దివంగత జయలలిత మృతి పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు మద్రాస్ హైకోర్టుకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
చెన్నై: దివంగత జయలలిత మృతి పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు మద్రాస్ హైకోర్టుకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
జయలలిత స్వయంగా కోరినందువల్లే ఆమె ఫొటో విడుదల చేయలేదని చికిత్స అందించిన ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. జయలలిత అనారోగ్యంతో గతేడాది సెప్టెంబర్ 22 న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
శశికళ ఓకే కానీ, మాదే: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జయ మేనల్లుడు
75 రోజుల పాటు చికిత్స పొంది డిసెంబరు 5 వ తేదీన మరణించారు. జయలలిత మరణంపై పలు సందేహాలున్నాయంటూ మద్రాస్ హైకోర్టులో జోసెఫ్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ కమిషన్ వేయాలని కోరారు.
మద్రాస్ హైకోర్టుకు నివేదిక
ఈ పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. జయకు అందించిన చికిత్సపై నివేదికను సీల్డు కవర్లో కోర్టుకు సమర్పిస్తామని ఆసుపత్రి గతంలో కోర్టుకు తెలిపింది.
అఫిడవిట్ దాఖలు
ఈ కేసు ఇవాళ మద్రాస్ హైకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ జి రమేష్, జస్టిస్ మహదేవన్లతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. గతంలో పేర్కొన్నట్లు సీల్డ్ కవర్లో కాకుండా అపోలో ఆసుపత్రి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
నిబంధనలు
చికిత్స పొందుతోన్న వ్యక్తి కి సంబంధించిన గోప్యత పైన మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా కొన్ని నిబంధనలు విధించిందని అపోలో అందులో తెలిపింది. ఆ నిబంధనలను అనుసరించి జయకు అందించిన చికిత్స వివరాలు బయటకు చెప్పలేదని వివరించారు.
ఫోటోలు వద్దని జయలలిత కోరారు
ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు సైతం జయలలిత అనుమతితోనే విడుదల చేశామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తన ఫోటోలను విడుదల చేయవద్దని జయ స్వయంగా కోరారని, అందుకే విడుదల చేయలేదన్నారు.
లండన్, ఎయిమ్స్ వైద్యుల చికిత్స
కేవలం అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులే కాక ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన వైద్యులు, లండన్కు చెందిన వైద్య నిపుణులు కూడా జయలలితకు చికిత్స అందించినట్లు అపోలో ఆసుపత్రి, తమిళనాడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
అఫిడవిట్ ఒకేలా ఉందని పిటిషనర్ ట్విస్ట్
జయకు సరైన చికిత్స అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన అఫిడవిట్ కు పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్, అపోలో అఫిడవిట్ ఒకేలా ఉన్నాయన్నారు. జయ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అందించేందుకు మరో రెండు వారాల సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోరారు. దీంతో కేసును వచ్చేనెల 13 వతేదీకి వాయిదా వేశారు.