జయకు అవమానం: శపథం, కరుణపై కక్ష తీర్చుకున్నారు
నిండు సభలో అవమానానికి గురైన జయలలిత శపథం చేసి కరుణానిధిపై కక్ష తీర్చుకున్నారు. ఇలా పలు మార్లు ఆమె తన పంతం నెగ్గించుకున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట అంటే తిరుగు ఉండదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అన్నటువంటి పని చేసి చూపిస్తారు. ఆమె బహిరంగంగా శపథాలు చేసి, వాటిని సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
1989 మార్చి 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితకు నిండు సభలో పరాభవం జరిగింది. దాంతోనే డిఎంకె అధినేత కరుణానిధి ఆమె బద్ధ శత్రువుగా మారారా. జయ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిని తీవ్రంగా విమర్శించారు. అది భరించలేని కొందరు డీఎంకే సభ్యులు ఆమెపై చేయి చేసుకున్నారు. మరికొందరు కొంగుపట్టుకుని లాగారు.
చెదిరిన జుట్టు, కళ్ల వెంట నీటితో ఆమె ఫోటోలు అప్పట్లో మీడియాకు విడుదలయ్యాయి. దాంతో ఆమె అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కరుణానిధిని ఓడించే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ శపథం చేశారు. ఆ ప్రకారమే 1991లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలో అడుగుపెట్టారు.
1996లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం బనాయించిన అక్రమాస్తుల కేసులో జయ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత తాను ఎక్కడికైతే వెళ్లానో, తన ప్రత్యర్థుల్ని కూడా అక్కడికే పంపిస్తానని ఆమె శపథం చేశారు. అన్నట్టుగానే 2001లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని అరెస్టు చేయించి అంతకు ముందు తనను ఉంచిన జైలు గదిలోనే వుంచారు.
అదే విధంగా అక్రమాస్తుల కేసు సందర్భంగా ఐటీశాఖ స్వాధీనం చేసుకున్న నగలన్నీ బహుమతులుగా వచ్చినవేనని డీఎంకే నేతలు వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆభరణాలను ముట్టని జయలలిత ఆ కేసు నుంచి విముక్తి పొందిన తరువాతే మళ్లీ నగలను ధరించారు.
కరుణానిధి ప్రభుత్వం రూ.1100 కోట్ల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనంలోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదని జయలలిత ఒకానొక సందర్భంలో ప్రకటించారు. అప్పటికే డీఎంకే ప్రభుత్వం జార్జ్కోటను గ్రంథాలయంగా మార్చి, కొత్త అసెంబ్లీలో నాలుగుమార్లు సమావేశాలు కూడా నిర్వహించింది.
అయితే 2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత ఆ గ్రంథాలయాన్ని మళ్లీ అసెంబ్లీగా మార్చిన తరువాతే సచివాలయంలోకి అడుగు పెట్టారు. కరుణానిధి కట్టించిన సచివాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చారు.