విషం తాగి అభిమాని మృతి: ఇలాంటివి వద్దని జయలలిత ఆవేదన
చెన్నై: ప్రస్తుత తన పరిస్థితుల నేపథ్యంలో తన అభిమానులు లేదా పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరు కూడా భావోద్వేగాలకు గురికావొద్దని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత శనివారం విజ్ఞప్తి చేశారు.
తన కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకే కేసులో దోషిగా నిర్ధారణ అయిన జయలలితకు అన్నాడీఎంకే శ్రేణుల నుంచి సానుభూతి వెల్లువలా వస్తోంది. పెరియాకుళం అన్నాడీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు పి రాజయోగియం విషం తాగి ఆసుపత్రిలో మృతి చెందాడు.
దీనిపై ఆమె స్పందించారు. ఇలాంటి చర్యలను తాను సమర్ధించనని, తమ పార్టీ ఇలాంటివాటిని ప్రోత్సహించదని జయలలిత స్పష్టం చేశారు. కార్యకర్తలెవరూ భావోద్వేగాలకు గురికావద్దన్నారు. కాగా, భార్యతో కలిసి విషం తాగిన రాజయోగియం ఓ వ్యవసాయ కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు.
తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. అతడి భార్య చావుబతుకుల మధ్య ఉంది. మృతి చెందిన రాజయోగియం కుటుంబానికి పార్టీ తరఫున మూడు లక్షల ఆర్థిక సహాయం, ఆసుపత్రిలో అతడి భార్య వైద్య సేవలకు 50 వేలు జయ ప్రకటించారు.