నేనే సీఎం ? శశికళ యూటర్న్: జయ ఆర్ కే నగర్ నుంచి పోటీ
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళ (59) ఇప్పుడు యూటర్న్ తీసుకుని పార్టీలో నేనే నెంబర్ వన్ అని చెబుతున్నారని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.
చెన్నై: తమిళనాడు ప్రజలకు అమ్మ అంటూ పిలుచుకునే జయలలిత చనిపోయిన విషయం ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో అన్నాడీఎంకే పార్టీలో అప్పుడే విభేదాలు బయపడుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళ (59) ఇప్పుడు యూటర్న్ తీసుకుని పార్టీలో నేనే నెంబర్ వన్ అని చెబుతున్నారని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.
పావులు కదుపుతున్న శశికళ: 'ఆర్కే నగర్' నుంచి పోటీ! రంగంలోకి ఫ్యామిలీ
రెండు రోజుల క్రితం జయలలితకు ప్రాణానికి ప్రాణం అయిన ఆమె ఇల్లు పోయెస్ గార్డెన్ లో అన్నాడీఎంకే నాయకుల సమావేశం జరిగింది. ఆ సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టడానికి శశికళ నిరాకరించారని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.
అయితే కుటుంబ సభ్యులను సంప్రదించిన తరువాత శశికళ ఒక్క సారిగా యూటర్న్ తీసుకోవడంతో పార్టీ సీనియర్లు కంగుతిన్నారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గం మీద శశికళ కన్నుపడింది.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నుంచి తాను పోటీ చేస్తానని గురువారం జరిగిన సమావేశంలో శశికళ చెప్పడంతో సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిసింది. అయితే వారిని పట్టించుకోని శశికళ తన వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య కూడా వివరించడంతో సీనియర్లు షాక్ తిన్నారు.
తాను సీఎం అవుతునానని శశికళ పరోక్షంగా చెప్పడంతో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అదేదో మూడు రోజుల ముందే చెప్పిఉంటే మంచిది కదా అని పన్నీరు సెల్వం అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.
ఇప్పుడు తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మీరు సీఎం కావాలంటే ఎలా ? అని పన్నీరు సెల్వం ప్రశ్నించారని సమాచారం. ఆర్ కే నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పన్నీరు సెల్వం చెప్పారు. అయితే ఆయన ప్రశ్నలకు శశికళ కోపంగా చూస్తూ మౌనంగా ఉండిపోయారని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.
శశికళ దయతో శాసన సభ్యులు అయిన వారు అన్నాడీఎంకే పార్టీలో చాలమందే ఉన్నారు. ఈ సమయంలో ఏం చెయ్యాలో తెలీక సీనియర్ మంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, వేలుమణి, తంగమణి, మణికంఠన్ తదితరులు మిన్నకుండిపోయారు.
పోయెస్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో శశికళ తన మనస్సులోని మాట బయటపెట్టడంతో అన్నాడీఎంకేలో విభేదాలు మొదలైనాయని సమాచారం. ఇదే సమయంలో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉండటంతో గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీ చేరుకుని కేంద్ర హౌం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తమిళనాడు పరిస్థితులు వివరించారని విశ్వసనీయంగా తెలిసింది.