'అమ్మ' చికిత్సపై ఎయిమ్స్ మెడికల్ రిపోర్ట్: తమిళ ప్రభుత్వం చేతికి..
జయలలిత చికిత్స నిమిత్తం గతంలో ఐదుసార్లు ఎయిమ్స్ వైద్యులు చెన్నైకి వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక అందించింది. జయలలిత చికిత్స నిమిత్తం గతంలో ఐదుసార్లు ఎయిమ్స్ వైద్యులు చెన్నైకి వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను జతచేస్తూ తాజాగా ఎయిమ్స్ వాటిని తమిళనాడు ప్రభుత్వానికి అందించింది. జయలలిత మృతిపై పన్నీర్ సెల్వం వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తుండటం.. ఇదే అనుమానాలను లేవనెత్తుతూ పలువురు కోర్టులను ఆశ్రయించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో.. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రికార్డులను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా నివేదికలపై ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వి శ్రీనివాస్ స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం అభ్యర్థన మేరకు జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జే రాధా కృష్ణన్కు అందజేసినట్లు ఆయన తెలిపారు.