స్టాలిన్ వస్తాడని తెలిస్తే ముందు సీటిచ్చేవాళ్లం: జయ కౌంటర్
చెన్నై: తన ప్రమాణ స్వీకారానికి హాజరైన డీఎంకే నేత స్టాలిన్కు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో స్టాలిన్ను వెనుక సీట్లో కూర్చోబెట్టారన్న వివాదం పైన కూడా ఆమె స్పందించారని తెలుస్తోంది.
ఆమె డీఎంకే అధినేత కరుణానిధి ఆవేదన పైన తనదైన శైలిలో స్పందించారు. డీఎంకే భవిష్యత్ అధ్యక్షుడు స్టాలిన్ తన ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నట్టు ముందే తెలిసి ఉంటే ఆయనకు మొదటి వరుసలో సీటు కేటాయించేవారమన్నారు.
స్టాలిన్ని పిలిచి అవమానించారు, జయ ఈ జన్మలో మారదు: కరుణానిధి
ప్రతిపక్ష నేతను పిలిచి అవమానించాలన్న ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. ఆయన రాకకు సంబంధించిన సమాచారం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. దీనిపై వివాదం అవసరం లేదన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన స్టాలిన్కు 16వ వరుసలో సీట్ కేటాయించారు. దీనిపై కరుణానిధి ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల తేడాలో తాను మంత్రి వర్గ విస్తరిస్తున్నానని, అనుమతివ్వాలని గవర్నర్ రోశయ్యకు జాబితా పంపించారు.
మంగళవారం గవర్నర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జయలలిత కేబినెట్లో కొత్తగా బెర్తులు ఖరారై వారిలో జీ. భాస్కరన్, పి. బాలక్రిష్ణారెడ్డి, నిలోఫర్, రామచంద్రన్ ఉన్నారు. వీరిలో ఇద్దరు మొదటిసారి శాసన సభ్యులుగా ఎన్నికైన వారు ఉన్నారు. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తవారితో కలిసి 32కు చేరింది.