ఆ ఐదుగురు.. జయ అమితంగా అభిమానించిన మహిళలు..
జయలలిత తన జీవితంలో ఎక్కువగా అభిమానించిన ఐదుగురు మహిళలు ఉన్నారు. వాళ్లెవరో ఒకసారి పరిశీలిస్తే..
చెన్నై: పబ్లిక్ లైఫ్ లో ఉండే వ్యక్తులకు సాధారణంగానే చాలామంది వ్యక్తులతో పరిచయం ఉంటుంది. పరిస్థితులు.. అవసరాలు.. రీత్యా.. కొంతమందికి దగ్గరవడం, కొంతమంది దూరమవడం జరుగుతుంటుంది. కానీ జయలలిత జీవితం ఇందుకు కాస్త భిన్నమనే చెప్పాలి.
అమ్మగా తమిళ జనం ఆరాధ్య నేతగా ఎదిగిన జయలలిత జీవితంలో అసలు స్నేహితులు అన్న పదానికే చోటు లేదు. జయలలిత జీవితంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. తన జీవితంలో ఎదురైన పరాభావాలు ఇందుకు కారణం కావచ్చు. అందుకే అతికొద్ది మందిని మాత్రమే ఆమె విశ్వసించారు. అందులోను ఒకరిద్దరితో మాత్రమే అత్యంత సన్నిహితంగా మెలిగారు.
ఆమె జీవితంలో ఎదురైన అవమానాలే ఆమెను పురుష ద్వేషిగా తయారుచేశాయనేవారు కూడా లేకపోలేదు. కాగా, జయలలిత తన జీవితంలో ఎక్కువగా అభిమానించిన మహిళలు ఐదుగురు ఉన్నారు. వాళ్లెవరో ఒకసారి పరిశీలిస్తే..
తల్లి సంధ్య:
తన చివరి రోజుల్లో తల్లి అండగా ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని జయలలిత భావించినట్టుగా చెబుతారు. దీన్నిబట్టి తల్లి పట్ల జయలలితకు ఎంతటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
జయను ఒక కూతురిలా కాకుండా.. ఓ స్నేహితురాలిగా ఆమె తల్లి భావించారని చెబుతారు. మొత్తంగా జయ ఎదుగదలో తల్లి పాత్ర చాలా కీలకంగా మారింది. ఆమె ప్రతి కదలికను గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేశారు.
ఒక సందర్బంలో.. తల్లితో గడపడం కోసం తను పడ్డ ఆరాటం గురించి చెబుతూ..చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్ లో చేరిన సందర్బాన్ని జయ గుర్తు చేసుకున్నారు. చాన్నాళ్లుగా అమ్మకు దూరంగా ఉన్న తనకు చెన్నైలో అమ్మతో కలిసి ఉంటూ చదువుకునే అవకాశం రావడం సంతోషంగా అనిపించిందని చెప్పారు.
కేథరిన్ సైమన్:
జయలలిత జీవితంలో చెరగని ముద్ర వేసిన మరో వ్యక్తి కేథరిన్ సైమన్. ముఖ్యంగా జయలలిత అనర్గళంగా ఇంగ్లీష్ భాషను మాట్లాడటం వెనుక కేథరిన్ సైమన్ బోధించిన పాఠాలున్నాయి. అందుకే సైమన్ మరణించిన సమయంలో.. 'నా జీవితంలో కీలక మలుపుకు కారణమైన నా గురువు' అంటూ ఆవేదన చెందారు. చెన్నై చర్చ్ పార్కు కాన్వెంట్లో చదువుతున్నప్పుడు జయలలితపై కేథరిన్ ప్రత్యేకంగా శ్రద్ధతో ప్రేమగా చూసుకునేవారు.
ఇందిరాగాంధీ:
అప్పటికే ఇందిరాగాంధీ పట్ల అభిమానం పెంచుకున్న జయలలిత 1984లో రాజ్యసభలో ప్రవేశించినప్పుడు.. తన ప్రసంగం ద్వారా ఇందిరను ఆకట్టుకున్నారు. మొన్నీమధ్యే జయలలిత ఇంగ్లీష్ స్పీచ్ అప్పట్లో ఓ హైలైట్ గా నిలిచిందని రాజ్యసభ చైర్మన్ కురియన్ గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ స్పీచ్ పట్ల ఇందిరా సంతోషం వ్యక్తం చేయడంతో.. తన అభిమాన నాయకురాలి మన్ననలు పొందినందుకు ఆనందపడ్డారు. రాజకీయపరంగాను జయలలిత సమస్యల పట్ల ఇందిర ప్రత్యేక శ్రద్ద చూపించారని చెబుతారు.
ఒకానొక సమయంలో.. జయలలిత లేఖకు స్పందించి చెన్నై రాజకీయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను అత్యంత విశ్వసనీయులైన వ్యక్తులను పంపించినట్టుగా చెబుతారు. యుగోస్లేవియా దేశాధ్యక్షుడికి ఏర్పాటు చేసిన విందుకు జయను ఇందిరాగాంధీ ఆహ్వానించారు. ఆ విందుకు అత్యంత ముఖ్యమైన 16 మంది నేతలే హాజరుకాగా, అందులో ఒకరు జయలలిత.
మనోరమ
తమిళనాట అచ్చిగా పేరొందిన తమిళ ప్రజల ఆరాధ్య నటి మనోరమ అంటే జయలలితకు చాలా ఇష్టం. సినిమాల్లో ఉండగానే వీరిద్దరు మంచి మిత్రులు. చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. వ్యక్తిగత జీవితాల్లోని కష్టసుఖాలను కూడా ఒకరితో మరొకరు పంచుకునేవారు.
జయలలిత రాజకీయాల్లోకి వచ్చాక కూడా మనోరమ ఆమెకు మద్దతుగా నిలిచారు. తీవ్ర రాజకీయ ఒత్తిడిలో చెన్నైకి దూరంగా సిరుదావూర్లో ఉన్న జయలలిత.. ఆమె మరణించిన సమయంలో హుటాహుటిన చెన్నైకి వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు. జయ అలా వెళ్లిన సందర్బాలు చాలా తక్కు.
శశికళ
జయలలిత-శశికళ ఈ ఇద్దరిది విడదీయరాని బంధం. జయ అంతరంగీక జీవితంలోకి ప్రవేశించగలిగిన ఏకైక వ్యక్తి కూడా శశికళ అనే చెప్పాలి. నెచ్చెలిగా జయ జీవితం చివరి రోజుల్లోను శశికళనే దగ్గరుండి చూసుకున్నారు. అంత్యక్రియలు సైతం శశికళ చేతుల మీదుగానే జరిగిన సంగతి తెలిసిందే.