జయ జైలుకు మర్రి చెన్నారెడ్డి కారణమా: ఆమె తీరని కోరిక
జయలలిత కష్టాలకు మర్రి చెన్నారెడ్డే కారణమా.... మర్రి చెన్నారెడ్డి ఆ రోజు విచారణకు అనుమతి ఇవ్వకపోతే ఆమె ఇన్ని కష్టాలను ఎదుర్కుని ఉండేవారు కాదు.
న్యూఢిల్లీ: జయలలిత జైలు పాలు కావడానికి మర్రి చెన్నారెడ్డే కారణమనే మాట వినిపిస్తోంది. ఆమెకు వెయ్యి మంది కరుణానిధులు చేయలేని నష్టం ఒక్క చెన్నారెడ్డి చేశాడని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
వాస్తవానికి 1991లో కాంగ్రెస్తో చేతులు కలిపి జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తమిళనాడు గవర్నర్గా నియమితులైన చెన్నారెడ్డి ముఖ్యమంత్రి జయలలితను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.
సుబ్రమణ్యస్వామి ఇచ్చిన అవినీతి ఫిర్యాదుపై మర్రి చెన్నారెడ్డి విచారణకు అనుమతి ఇచ్చారు. అప్పుడు ఆయన విచారణకు అనుమతి ఇవ్వకపోయి ఉంటే ఆమెపై అవినీతి కేసులు నమోదయ్యేవి ఉండేవి కావు. జైలుకు వెళ్లాల్సి వచ్చేది కాదు.
కుష్వంత్ సింగ్తో జయ ఇలా చెప్పారు...
తాను ఎప్పటికైనా ముందు సీటులో ఉన్న ప్రధాని సీట్లో కూర్చుంటానని రాజ్యసభ సభ్యురాలిగా వెనక బెంచీలో కూర్చున్న జయలలిత తన పక్కన కూర్చున్న నామినేటేడ్ సభ్యుడు, జర్నలిస్టు కుష్వంతసింగ్కు చెప్పేవారని అంటారు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నదే ఆమె కోరిక.
ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి...
జయలలితకు 1999లో ప్రధాని పదవిని అవకాశం ఒక్కసారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కారణంగానే తనకు ప్రధాని పదవి దక్కలేదని జయలలిత ఆగ్రహించారు. దాంతో అప్పటి నుంచి కాంగ్రెసు తో సంబంధాలను తెంచుకొని బీజేపీకి జయ దగ్గరయ్యారు.
వాజ్పేయి ప్రభుత్వాన్ని కూల్చింది అందుకే..
వాజ్పేయి ప్రభుత్వాన్ని పడగొట్టాక కాంగ్రెస్ తనకు మద్దతునిచ్చి ప్రధానిని చేస్తుందని జయలలిత భావించారు. 1979లో మొరార్జీ దేశాయ్ను పడగొట్టి చరణ్సింగ్ను, 1989లో వీపీ సింగ్నును తొలగించి చంద్రశేఖర్ను కాంగ్రెసు ప్రధానిని చేసింది. తనకు కాంగ్రెసు మొండిచేయి చూపిందని ఆమె కాంగ్రెసుపై కోపంగా ఉంటూ వచ్చారు.
ఆయన ఏర్పాటు చేసిన టీ పార్టీలోనూ..
1999లో సుబ్రమణ్యస్వామి అశోకా హోటల్లో ఏర్పాటు చేసిన టీ పార్టీలో సోనియా, పీవీ నరసింహరావులతో భేటీ అయిన జయలలిత ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులా ఉపయోగపడ్డారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని పడగొడితే తనను ప్రధానిని చేస్తానని మాట ఇచ్చిన సోనియాగాంధీ చివరికి మాట మార్చారని అంటారు.
దేవెగౌడ అయినప్పుడు నేను కానా..
కర్ణాటకలో 25 స్థానాలు గెల్చుకున్న దేవెగౌడ ప్రధాని అయ్యారని, తమిళనాట 35 స్థానాలకు పైగా గెల్చుకుంటే తానే ప్రధాని అవుతానని జయలలిత ధీమాగా చెప్పేవారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా మొత్తం స్థానాలను మనం గెల్చుకుంటే, దేవుడు కరుణిస్తే తను ప్రధాని అవుతానని జయలలిత ఎన్నికల ప్రచార సభలో చెబుతూ వచ్చారు.