ఏపీకి ప్రత్యేక ట్విస్ట్: జేడీ శీలం కొత్త వ్యాఖ్య, మోడీని నిలదీసిన సొంత ఎంపీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాలో కొత్త ట్విస్ట్! బీహార్ ఎన్నికల కోసమే బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జేడీ శీలం గురువారం ఆరోపించారు. ప్రత్యేక హోదాపై బీజేపీ తుచ్చ రాజకీయాలు చేస్తుందన్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. బీజేపీ మాట నిలబెట్టుకోకుండా వెన్నుపోటు పొడిచిందన్నారు.
గురువారం ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై జేడీ శీలం స్పందించారు. చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడానికి కాంగ్రెస్ సిద్ధమని, బీజేపీ సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరింది. చట్టంలోని మిగతా హామీలనైనా బీజేపీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా బీహార్ కూడా ప్రత్యేక హోదా అడుగుతోందన్నారు. ఈ ఏడాదే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, అందుకే ఏపీకి ఆలస్యం చేస్తున్నారని చెప్పారు.
మోడీని నిలదీసిన బీజేపీ ఎంపీ
బీజేపీ తరఫున ఎన్నికైన ఎంపీ భరత్ సింగ్.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. ఈ ఘటన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జరిగింది. ఆయన ప్రశ్నతో మిగతా ప్రజాప్రతినిధులు, కేంద్రమంత్రులు కాస్త ఇబ్బంది పడ్డారు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అభివృద్ధి జాడలు కనిపించడం లేదన్నారు. కేంద్రమంత్రులకు, బీజేపీ కార్యాలయ బేరర్లూ ఎంపీలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. తాము లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని మరో ఎంపీ అన్నారు. ఆ సమయంలో మోడీ అసహనంగా ఫీలయ్యారని తెలుస్తోంది. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య వివరణ ఇచ్చారు.