బీహార్ సీఎం మాంఝీకి అధిష్టానం తలంటు, హెచ్చరిక
పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మాంఝీని ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆయనకు సూచించామని, వాటిని బీజేపీ ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని చెప్పామని త్యాగి చెప్పారు.
కాగా, ఇటీవల మంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత దేశంలోని అగ్రవర్ణాల వాళ్లంతా విదేశీయులేనని కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. పెళ్లి తర్వాత భర్తలు ఏళ్ల తరబడి బయటే ఉంటే, వారి భార్యలు ఏం చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసునన్నారు.
బుధవారం మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు తాను ప్రధాన మంత్రిని కావచ్చునని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రిని అయినట్లే దేశానికి తాను ప్రధాన మంత్రిని అవుతానని ఆయన బుధవారం ఓ అధికారిక కార్యక్రమంలో అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహాదళిత్ కమ్యూనిటీకి చెందినవాడిని కాబట్టే ప్రతి ఒక్కరూ తనను లక్ష్యం చేసుకున్నారన్నారు.
శక్తివంతమైనవారు తనను చూసి నవ్వుతారని, ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని వారు తనను అపహాస్యం చేస్తారని ఆయన అన్నారు. వారు తనను లక్ష్యం చేసుకోవడం కొనసాగిస్తే ఏదో ఒక రోజు తాను ప్రధాన మంత్రిని అవుతానన్నారు. లోకసభ ఎన్నికల్లో జెడి (యు) ఓడిపోవడంతో నితీష్ కుమార్ స్థానంలో జతిన్ రామ్ మంఝీ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు.
మిగతావారి వాళ్ల లాగా కాకుండా తాను హృదయం విప్పి మాట్లాడుతానని ఆయన అంటారు. ప్రజా జీవితంలో ఏదీ దాచుకోవడానికి లేదని అంటారు. పేద దళిత కుటుంబంలో పుట్టడం తన తప్పా అని ఆయన ఉద్వేగభరితంగా ప్రశ్నించారు. మరోవైపు, తమ ప్రాంత ప్రజలకు అనుగుణంగా పని చేయకుంటే కేంద్రమంత్రులను బీహార్లో అడుగుపెట్టనివ్వమని అన్నారు.