మేయర్ కావాలంటే 131 ఓట్లు కావాలి
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్, డిప్యూటి మేయర్ పదవిలో కుర్చోవాలంటే కచ్చితంగా 131 ఓట్లుపడాలి. బీబీఎంపీ కార్యాలయం అధికారులు ఈ విషయం అధికారికంగా వెల్లడించారు.
బీబీఎంపీలో 198 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో బీజేపీకి 100 మంది, కాంగ్రెస్ కు 76 మంది, జేడీఎస్ కు 14 మంది, 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇటివల కాంగ్రెస్, జేడీఎస్ దోస్తి కుదిరింది. గత నాలుగు రోజుల నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతుంది.
బీజేపీ నాయకులు సైతం జేడీఎస్ మద్దతు తీసుకోవాలని ప్రయత్నించారు. ఇంత కాలం తాము జేడీఎస్ మద్దతు తీసుకోం అని చెప్పిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఎలాగైనా బీబీఎంపీలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి.
198 మంది కార్పొరేటర్లతో పాటు బెంగళూరులోని 28 మంది శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంఎల్ సీలు మేయర్ ఎన్నికలలో ఓట్లు వెయ్యడానికి అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం మొత్తం ఓట్లు 260.
మేయర్ కుర్చిలో కుర్చోవాలంటే కచ్చితంగా 131 ఓట్లు సంపాధించాలి. బీజేపీకి 126 ఓట్లు, కాంగ్రెస్ కు 101, జేడీఎస్ కు 21 ఓట్లు, ఇతరులు 8 మంది ఉన్నారు. అదే విదంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు ( కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, విజయ్ మాల్య, రాజీవ్ చంద్రశేఖర్) ఉన్నారు.
వీరితో పాటు ఇద్దరు ఎంఎల్ సీలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ తో పాటు స్వతంత్రులు కలుపుకుని బీబీఎంపీలో అధికారంలోకి రావాలని ప్లాన్ లు వేస్తున్నారు. అందుకు మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే దేవేగౌడ ఎప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దేవేగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని అంటున్నారు.