రైల్వే బడ్జెట్ అంటే కొత్తవే కాదు.. బాగుందన్న జేపీ, మమత ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన పలువురు నేతలు స్పందించారు. లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్ అంటే కొత్త రైళ్లు, భారీ సంఖ్యలో ప్రాజెక్టులు కాదన్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారన్నారు. రెండు దశాబ్దాల్లో ఇది అత్యుత్తమ బడ్జెట్ అన్నారు.
రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికకు పెద్ద పీట వేశారన్నారు. నిధుల సంగతి చూసుకుంటామన్నారు. ఈ బడ్జెట్ సమతూల్యంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
పార్లమెంటులో గురువారం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. రైల్వే ఛార్జీలు పెంచలేదని వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఛార్జీలు పెంచలేదని చెబుతున్న ఎన్డీయే సర్కారు తొలినాళ్లలోనే వాటిని పెంచిందన్నారు.
బీజేపీ వాక్చాతుర్యం కేంద్ర రైల్వే బడ్జెట్లో కనిపించిందని మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ అన్నారు. మాటలకు, వాటి అమలుకు మధ్య చాలా అంతరం కనిపిస్తోందన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి బడ్జెట్ను ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రజలను బీజేపీ మోస్తం చేస్తోందన్నారు. ఆరు నెలల్లో ఏపీకి రైల్వేజోన్ ఇవ్వాలని చట్టంలో ఉన్నా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు.