ఆ జడ్జి దేశం విడిచి వెళ్లిపోయారా ? రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని మనవి, తమిళనాడులో !
పశ్చిమ బెంగాల్ హైకోర్టు జడ్జి పదవిలో ఉండగా ఆరు నెలల జైలు శిక్ష పడిన న్యాయమూర్తి జస్టీస్ సీఎస్. కర్ణన్ ఎక్కడ ఉన్నారో అర్థం కాకపోవడంతో కోల్ కతా పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. జస్టిస్ కర్ణన్ ఎక్కడ ఉన్నార
న్యూఢిల్లీ/చెన్నై: పశ్చిమ బెంగాల్ హైకోర్టు జడ్జి పదవిలో ఉండగా ఆరు నెలల జైలు శిక్ష పడిన న్యాయమూర్తి జస్టీస్ సీఎస్. కర్ణన్ ఎక్కడ ఉన్నారో అర్థం కాకపోవడంతో కోల్ కతా పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. జస్టిస్ కర్ణన్ ఎక్కడ ఉన్నారో అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది.
పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. జస్టిస్ కర్ణన్ విదేశాలకు పారిపోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన భారతదేశంలోనే ఉన్నారని, ఎవరికీ తెలియన ఓ ప్రాంతంలో ఉన్నారని జస్టిస్ కర్ణన్ సన్నిహితులు అంటున్నారు.
శిక్ష పడిన మొట్టమొదటి జడ్జి
పదవిలో ఉండగానే శిక్ష పడిన మొట్టమొదటి న్యాయమూర్తిగా జస్టిస్ కర్ణన్ నిలిచారు. అయితే జస్టిస్ కర్ణన్ అరెస్టుకు భయపడి ఏమీ తప్పించుకుని తిరగడం లేదని, మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితులు మీడియాకు చెప్పారు.
గెస్ట్ హౌస్ నుంచి మాయం
తమిళనాడులోని ఓ గెస్ట్ హౌస్ లో జస్టిస్ కర్ణన్ ఉన్నారని తెలుసుకున్న కోల్ కతా పోలీసులు చెన్నై చేరుకున్నారు. జస్టిస్ కర్ణన్ కోసం చెన్నై మొత్తం గాలించినా ఫలితం శూన్యం. చివరికి పోలీసులు ఆయన కారు డ్రైవర్ మొబైల్ ఫోన్ నెంబర్ ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.
ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని !
తనపై జారీ చేసిన ఉత్తర్వులను రీకాల్ చేసుకోవాలని జస్టిస్ కర్ణన్ సుప్రీం కోర్టును కోరారు. కర్ణన్ సహచరులు కొత్తగా ఒక రివ్వూ దరఖాస్తు సిద్దం చేసే పనిలోపడ్డారు. త్వరలో దాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేస్తారని సమాచారం. అంత వరకు ఆయన అజ్ఞాతంలోనే ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వుల పూర్తి కాఫీ
సుప్రీం కోర్టు ఉత్తర్వుల పూర్తి కాఫీ చేతికి అందితే కానీ జస్టిస్ కర్ణన్ పిటిషన్ దాఖలు చెయ్యడానికి కానీ, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం కుదరదు. ఇప్పుడు ఆయన సన్నిహితులు సుప్రీం కోర్టు ఉత్తర్వుల పూర్తి కాఫీ చేతికి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రపతి అపాయింట్ మెంట్
కుల్ భాషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ కోర్టులో సవాలు చేసినట్లు తన కేసును కూడా అక్కడికి పంపించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అడిగేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా జస్టిస్ కర్ణన్ కోరినట్లు తెలిసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జస్టిస్ కర్ణన్ రాష్ట్రపతికి మనవి చేశారని ఆయన న్యాయవాదులు గురువారం మీడియాకు చెప్పారు.
తమిళనాడులో అల్లర్లు ?
జస్టిస్ కర్ణన్ ను అరెస్టు చేస్తే తమిళనాడులోని ఆయన స్వగ్రామంలో అల్లర్లు చెలరేగుతాయని తమిళనాడు ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని తెలిసింది. ఇప్పటికే ఆయన స్వగ్రామంలో నిరసన కార్యక్రమాలు మొదలైనాయి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
వీలైనంత వరకు తప్పించుకోవడానికే
ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ పోలీసులు జస్టిస్ కర్ణన్ ను అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే వీలైనంత వరకు బయటకురాకుండా జస్టిస్ కర్ణన్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.