విద్యా విధానంపై కస్తూరి రంగన్ కమిటీ: ఏం చేస్తుంది?
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) ముసాయిదా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కస్తూరి రంగన్ చైర్మన్గా నూతన కమిటీని నియమించిం
న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) ముసాయిదా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కస్తూరి రంగన్ చైర్మన్గా నూతన కమిటీని నియమించింది.
నూతన విద్యావిధాన రూపకల్పన కమిటీలో సభ్యులుగా విద్యారంగంలోని వివిధ విభాగాల్లో విస్తృత అనుభవం గల ఎనిమిది మంది నిపుణులను కేంద్ర మానవ వనరులఅభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎంపిక చేశారు. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి కేజే అల్ఫోన్సే కనాంథానం, విద్యావేత్తలు డాక్టర్ రాంశంకర్ కురీల్, డాక్టర్ ఎంకే శ్రీధర్, డాక్టర్ మజహర్ అసిఫ్, యూపీ మాజీ విద్యాశాఖ అధికారి కృష్ణమోహన్ త్రిపాఠి, మంజుల్భార్గవ, వసుధాకామత్, భాషా విద్యా కమ్యూనికేషన్స్ నిపుణుడు డాక్టర్ టీవీ కట్టిమణి నియమితులయ్యారు.
విద్యారంగంలోని వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వారిని కమిటీ సభ్యులుగా నియమించిన ప్రభుత్వం.. వివిధ సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు చోటు కల్పించిందని హెచ్చార్డీ అధికారి ఒకరు తెలిపారు. వివిధ వయస్సు గ్రూపుల వారికి కమిటీలో చోటు కల్పించడం వల్ల వారి అనుభవం.. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ అవగాహన విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని హెచ్చార్డీ అంచనా వేస్తున్నది.
ఇలా కస్తూరి రంగన్ కమిటీ
కస్తూరి రంగన్ కమిటీకి కేంద్ర ప్రభుత్వం 30 నెలల గడువు ఇచ్చింది. ఈ కమిటీ విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థులు, విద్యారంగ నిపుణులతో వివిధ స్థాయిల్లో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నది. ఇదే అంశంపై కొన్నేండ్ల క్రితం కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ నియమించిన టీఎస్ఆర్ సుబ్రమణ్యం కమిటీ సిఫారసులను నూతన విద్యావిధాన రూపకల్పనలో కస్తూరి రంగన్ కమిటీ వినియోగించుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే నూతన విద్యావిధానం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘మై గవ్' పోర్టల్కు వివిధ వర్గాల నుంచి వచ్చిన 26 వేల అభిప్రాయాలను కూడా కస్తూరి రంగన్ కమిటీ వినియోగించుకోనున్నది.
వ్యవసాయశాస్త్రవేత్త డాక్టర్ రాంశంకర్ కురీల్ ఇలా
ఆయన కేరళ క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో వందశాతం అక్షరాస్యత సాధించడంలో కీలకభూమిక వహించారు. పాఠశాలవిద్యలో సంస్కరణల అమలు సమయంలో ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడంలో అనుభవం గడించారు. మధ్యప్రదేశ్లోని మోహ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ వైస్ చాన్స్లర్. ప్రధాన విద్యారంగంతోపాటు ప్రగతి పథకంలోకి అట్టడుగు వర్గాల ప్రజలను తేవడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై పలు అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాశారు.
పాఠశాల విద్యారంగంలో ఇలా వసుధాకామత్ సేవలు
కర్ణాటక రాష్ట్ర ఇన్నోవేషన్ కౌన్సిల్, నాలెడ్జ్ కమిషన్లకు మాజీ సభ్య కార్యదర్శిగా సేవలందించారు. కేంద్ర విద్యారంగ సలహా మండలి (కేబ్)లో సభ్యుడు కావడంతోపాటు దివ్యాంగ్ స్కాలర్ కూడా. వసుధాకామత్ ముంబైలోని ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ మాజీ వైస్చాన్స్లర్. ఆమె పాఠశాల విద్యారంగ అభివృద్ధికి విస్తృతంగా కృషి చేశారు. విద్యారంగంలో టెక్నాలజీ వినియోగంలో పేరొందిన విద్యావేత్త.
కృష్ణ మోహన్ త్రిపాఠి ఇలా
అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో గణిత శాస్త్రవేత్త. యుక్త వయస్సులోనే గెస్ నంబర్ థియరీలో ఆయన సేవలకు ఫీల్డ్ మెడల్ అందుకున్నారు. కృష్ణ మోహన్ త్రిపాఠి ఉత్తరప్రదేశ్ మాధ్యమిక పాఠశాల, ఇంటర్మీడియట్ పరీక్షా బోర్డులకు చైర్పర్సన్గా వ్యవహరించారు. సర్వశిక్షా అభియాన్ పథకం అమలులో అపార అనుభవం గడించారు.
అసోంలో పర్షియన్ శాస్త్రవేత్త ఇలా
అమర్కంటక్లోని గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్. ఆయన భాషా విద్య, మాస్ కమ్యూనికేషన్స్లో నిష్ణాతులు. డాక్టర్ మజహర్ అసిఫ్ గువాహటి విశ్వవిద్యాలయంలో పర్షియా ప్రొఫెసర్గా పని చేశారు. ఆయన సలహాలతోనే తొలి పర్షియన్ అసోమీ ఇంగ్లిష్ డిక్షనరీ సంకలనం తయారైంది.