పుస్తక రూపంలో.. కలాం ఆగిపోయిన ప్రసంగం
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పూర్తి చేయలేని చివరి ప్రసంగాన్ని పుస్తక రూపంలో తీసుకోస్తామని ఆయన సన్నిహితుడు, అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. అబ్దుల్ కలాం గత సోమవారం షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయి, అనంతరం గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అంశం ‘క్రియేటింగ్ ఏ లివబుల్ ప్లానెట్ ఎర్త్' అనేది కేవలం ఓ ప్రసంగం కాదని శ్రీజన్ పాల్ సింగ్ తెలిపారు. కలాం ఆ అంశంపై పుస్తకం కూడా రాస్తున్నారని, మిగితా సగం త్వరలోనే పూర్తి చేయాలనుకునేవారని శ్రీజన్ పాల్ గుర్తు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆయనే మనల్ని వదిలివెళ్లిపోయారని, కలాం ఆశయాన్ని తాము పూర్తి చేయనున్నట్లు శ్రీజన్ పాల్ తెలిపారు. ఎలాగైనా మిగితా సగం ప్రసంగాన్ని ఆ పుస్తకంలో రాసి విడుదల చేస్తామని శ్రీజన్ చెప్పారు.