సూపర్ బిట్ రోల్, శబరిలాంటి వాడిని: నాగార్జునతో కమల్ హాసన్
హైదరాబాద్: నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు చివరి ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ప్రసారమైంది. ఈ ఎపిసోడ్లో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. ఆయన సినిమాలకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కె బాలచందర్ను పదే పదే తలుచుకున్నారు. ఎప్పుడు తెలుగు సినిమా చేస్తున్నారని నాగార్జున అడిగితే త్వరలో అని చెప్పారు. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం 2 సినిమాలు ఉన్నాయని కమల్ హాసన్ చెప్పారు.
తనకు బాలచందర్ తండ్రి లాంటివాడని ఆయన చెప్పుకున్నారు. డైలాగ్లు కూడా చెప్పడం రాని తనను నటుడిగా తీర్చిదిద్దారని చెప్పుకున్నారు. హిందీ మరో చరిత్ర సినిమా ఏక్ దూజేకే లియే సినిమాలో తనను నటించాలని అడిగినప్పుడు, అప్పటికే రెండు లక్షల రూపాయలు తాను తమిళంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని, అదే అడిగానని, నిర్మాత ఎల్వీ ప్రసాద్ కాస్తా వెనకడుగు వేశారని, హిందీలో కొత్త నటుడు అంత రెమ్యునరేషన్ ఏమిటన్నారని ఆయన అన్నారు. లక్ష రూపాయలు ఇస్తే హిందీ నటులు వస్తారని ఎల్వీ ప్రసాద్ అన్నారని ఆయన గుర్తు చేశారు.
అయితే, బాలచందర్ వీడు ఉంటేనే చేస్తానని, అవసరమైతే తనకు ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని బాలచందర్ అన్నారని, ఏ నటుడితోనైనా చేస్తానని సాధారణంగా చాలా మంది దర్శకులు అంటారని, కానీ బాలచందర్ వీడే కావాలని అడిగారని ఆయన వివరించారు. ఉత్తమ విలన్ మంచి కథ అని, అయితే మామూలు కథే అయినా బాగుంటుందని ఆయన అన్నారు. ఉత్తమ విలన్ ట్రయలర్ను ఎపిసోడ్లో ప్రదర్శించారు. ఇందులో చాలా మంది నటులు చిన్న చిన్న పాత్రలు వేశారని, బాలచందర్ కూడా కనిపిస్తారని కమల్ హాసన్ చెప్పారు.తన కూతుళ్ల సినిమా నటన గురించి కూడా కమల్ హాసన్ మాట్లాడారు. శృతి హాసన్ తెలుగు అంబాసిడర్గా మారిందని అన్నారు.
తాను రామాయణంలో శబరిలాంటివాడినని, తనకు నచ్చిన సినిమాను ప్రేక్షకులకు ఇస్తానని అన్నారు. రాముడికి రుచి చూసి ఫలం ఇచ్చిన శబరి సంఘటనలో ప్రేమ ఉందని ఆయన అన్నారు. తాను డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా హైదరాబాద్ వచ్చానని, అక్కినేని నాగేశ్వర రావు చేసిన శ్రీమంతుడు సినిమాకు పనిచేశానని, అప్పుడు తనకు 17, 18 ఏళ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో తాను హారతి తీసుకోలేదని, వెంటనే కమల్ హాసన్ కదా నువ్వు ముస్లింవా అని అక్కినేని అడిగారని, అయితే కాదని చెప్పానని, హేతువాదిని అని చెప్పానని, నేను కూడా హేతువాదినే అంటూ అక్కినేని నాగేశ్వర రావు కరచాలనం చేశారని, అంత పెద్ద నటుడు ఏ డాంబికాలు లేకుండా అలా చేతులు కలపడం మరుపునకు రాని సంఘటన అని అన్నారు.
మరో మాట చెప్పాలంటూ తాను శ్రీమంతుడు సినిమాలో సూపర్ బిట్ ఒక్కటి చేశానని చెప్పారు. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ప్రసారం చేశారు. రాజబాబు అమ్మాయిలతో నటించిన దృశ్యం అది. అందులో అమ్మాయిల మధ్య పడుకుని కమల్ హాసన్ కనిపించాడు. దాన్నే కమల్ హాసన్ సూపర్ బిట్ రోల్ అని చెప్పుకున్నారు. శ్రీమంతుడులోని ఓ పాటను కొద్దిగా పాడి కూడా కమల్ హాసన్ వినిపించారు. మొదటి పెగ్గులో నిషా అంటూ కమల్ హాసన్ కాస్తా పాడి వినిపించారు. ఆ పాట ఇంకా గుర్తుందా అని నాగార్జున అడిగితే శ్రీమంతుడు సినిమా మొత్తం పనిచేశానని చెప్పారు.
దశావతారం సినిమా అనుభవాలను కమల్ హాసన్ వివరించారు. ఆ సినిమా కోసం ఎంతగా కష్టపడిందీ వివరించారు. చాలా సమయం తీసుకుందని అన్నారు. పది పాత్రలకు మేకప్ వేసుకోవడం దగ్గర నుంచి వాటి కోసం ఎంత రిస్క్ తీసుకుందీ చెప్పారు. బామ్మ పాత్ర ఆరు గంటలు చేశానని ఆయన చెప్పారు. ఆ పాత్ర చేసినప్పుడు భోజనం కూడా చేయడానికి వీలు కాలేదని ఆయన అన్నారు.
నటన అనేదానికి అంతం లేదని, ఎల్లవేళలా నిత్యవిద్యార్థిలా చదువుకోవడం లాంటిదని అన్నారు. చదువు పూర్తయిందండీ అని ఎవరైనా అంటే నవ్వు వస్తుందని అన్నారు. బాలచందర్ శారీరకంగా బలహీనంగా మారినా స్పిరిట్ మాత్రం చివరి దాకా ఉందని చెప్పారు. తాను బాలచందర్, సింగీతం శ్రీనివాస రావు వద్ద చాలా నేర్చుకున్నానని ఆయన చెప్పారు.
నిజానికి తాను నటుడిగా రావాలని అనుకోలేదని, రెండు సినిమాలు చేసిన తర్వాత కూడా తనను అసిస్టెంట్గా తీసుకోవాలని బాలచందర్ను అడిగానని, ఆయన అందుకు అంగీకరించలేదని, పెద్ద స్టార్వి అవుతావని చెప్పేవారని, స్టార్ ఎప్పుడవుతానూ అని తాను అనుకుంటుండేవాడినని ఆయన అన్నారు. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీలాగానే తాను గాంధీని చూస్తానని ఆయన అన్నారు. గాంధీ తనలో ఉన్నాడని చెప్పారు. గాంధీని కాంగ్రెసు వ్యక్తిలా తాను చూడడని అన్నారు. గాంధీ గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు కూడా అని ఆయన అన్నారు. ప్రతిదాన్నీ ఆయన నవ్వుతో స్వీకరించారని కమల్ హాసన్ అన్నారు. గాంధీ లాగా చేయలేకపోతున్నామే అనే బాధ ఉంటుందని, అయితే కొంత మేరకు ప్రజా సేవ చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రజా సేవలో మిమిక్రీ చేస్తున్నానని ఆయన అన్నారు. సాధించాలనే కల సొంతానిదై ఉండాలని, అప్పుడు విజయం సాధించవచ్చునని, ప్రతి వ్యక్తీ లోకనాయకుడేనని ఆయన అన్నారు.