గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన హీరో శివరాజ్ కుమార్
బెంగుళూరు: ప్రముఖ కన్నడ హీరో, దివంగత రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ని బెంగుళూరులోని విఠల్ మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ నిర్వహించారు. దాంతో ధమనుల్లో రెండు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది.
ఈ క్రమంలో ఆయనకు యాంజియోప్లాస్టీ గానీ, ఓపెన్ హార్ట్ సర్జరీగానీ చేసే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలారు. ఈ విషయాన్ని జిమ్ మేనేజర్ వెంటనే శివరాజ్ కుమార్ భార్య గీతకు తెలుపగా ఆయనను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారని సమాచారం. అయితే ప్రస్తుతం తన సోదరుడికి ఎలాంటి ప్రమాదం లేదని శివరాజ్ కుమార్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తెలిపారు. 54 ఏళ్ల శివరాజ్ కుమార్ కన్నడ ప్రజల ఆరాధ్యదైవం, ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ తనయుడు. ప్రస్తుతం ఆయన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కిల్లింగ్ వీరప్పన్' లో నటిస్తున్నారు.
ఇటీవలే శివరాజ్ కుమార్ కూతురు నిరుపమ వివాహాం ప్రముఖ డాక్టర్ దిలీప్తో అంగరంగ వైభవంగా జరిగింది. ఆగష్టు 3వ తేదిన నిరుపమ-దిలీప్ ల నిశ్చితార్థం, ఆగష్టు 31న వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వివాహానికి సౌత్ ఇండియాలో వున్న పలు సినీ ప్రముఖులు, నటీనటులు హాజరైన సంగతి తెలిసిందే.