కన్నడ సాహితీవేత్త దారుణ హత్య: ఇంట్లోనే కాల్పులు
బెంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మాజీ ఉప కులపతి ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని సాయుధులు కాల్చి హత్య చేశారు.ఆదివారం ధార్వాడలోని తన స్వగృహంలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆదివారం ఉదయం 8.40 గంటలకు ఇద్దరు ఆగంతకులు బైక్పై కలబుర్గి ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు రోడ్డు మీదే నిలబడగా, మరొకడు లోపలకు వచ్చాడు. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసుకొని బయటకు వచ్చిన కలబుర్గిపై దాడి చేశాడు. అతి సమీపం నుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.
నుదురు, కంటి భాగాల్లోకి తూటాలు దూసుకుపోవడంతో కలబుర్గి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స కొనసాగుతుండగానే, తీవ్ర రక్తస్రావం కారణంగా కన్నుమూశారు. అయితే, కుటుంబ సభ్యుల వాదన మరో విధంగా ఉంది. కలబుర్గి శిష్యులమంటూ ఇద్దరు ఆయన ఇంటికి వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టగానే కలబుర్గి భార్య తలుపు తీశారు. కలబుర్గి కావాలని అడగడంతోఇంటి ఆవరణలో వాకింగ్ చేస్తున్న కలబుర్గిని ఆమె చూపించారు.
వారు దగ్గరకు రాగానే మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారని కలబుర్గి అడుగుతుండగానే తూటాల వర్షం కురిపించారు. కలబుర్గి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. హంపీ యూనివర్సిటీ ఉప కులపతిగా పనిచేసిన కలబుర్గి సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు.
1938 నవంబరు 28న బీజాపూర్ జిల్లా సింధగి తాలూకా గుబ్బేవాడి గ్రామంలో కలబుర్గి జన్మించారు. 1962లో ధార్వాడ కర్ణాటక కళాశాల అధ్యాపకునిగా ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. సాహితీ ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, కన్నడ సాహితీ పురస్కారం, పంపా అవార్డు, పురస్కారాలను అందుకొన్నారు.
రాళ్లకు మొక్కవద్దంటూ కలబుర్గి చేసిన వ్యాఖ్యలు ఆయనను ఒక బలమైన సా మాజిక వర్గానికి ప్రత్యర్థిగా మార్చాయి. ఆ వర్గమే ఆయన హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కుటుంబ ఆస్తి తగాదాల వైపు నుంచీ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యూఆర్ అనంతమూర్తికి అత్యంత సన్నిహితుడైన కలబుర్గి ఆయన మాదిరిగానే మతతత్వ రాజకీయాలపై పదునైన వ్యాఖ్యలు చేసేవారు. ఈ క్రమంలో ఒకవర్గం ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఆయనకు కల్పించిన భద్రతను ఇటీవల ఉపసంహరించుకోవడం తీవ్ర వివాదానికి కారణమవుతోంది.