యువతే మోదీ ప్రాధాన్యం: వొక్కలిగల మద్దతు సరే.. మార్గదర్శక మండలికే కృష్ణ పరిమితమా?
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరిపోవడంతో హస్తం పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తుండగా, ఆయన రాజకీయ భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోయ
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరిపోవడంతో హస్తం పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తుండగా, ఆయన రాజకీయ భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన మరుసటి రోజు దేశ రాజధాని 'హస్తిన' వీధుల్లో రోడ్ షో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు యువతేనని గుర్తు చేశారు. తాజాగా యువతరం కలలే భారతదేశం కలలు అని అభివర్ణించారు. తద్వారా తన ద్రుష్టంతా యువతపైనేనని తేల్చేశారు.
అంతేకాదు తన క్యాబినెట్ లోనూ సీనియర్లకు చోటు లేదని నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నారు. 75 ఏళ్ల వయస్సు దాటిన నేతలందరినీ క్యాబినెట్ నుంచి పక్కకు తప్పిస్తూ అప్రకటిత నిబంధన అమలు చేస్తున్నారు. ఇటు కేంద్రంలోనూ అటు రాష్ట్రాల్లోనూ ఇదే అప్రకటిత సూత్రం అమలులో ఉన్నది. 2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతాకుమార్ తదితరులను పక్కనబెట్టేశారు. వారిలో ఒక్కరికీ తన క్యాబినెట్లో చోటు కల్పించలేదు.
పాత తరం నేతలకు మార్గదర్శక్ మండల్ కేంద్రం
బీజేపీలో సీనియర్ల కోసం ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కొత్త నాయకత్వం కొత్త కూర్పు రూపొందించింది అదే మార్గదర్శక్ మండల్. ఇందులో సీనియర్ నేత లాల్ క్రుష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతా కుమార్, యశ్వంత్ సిన్హాలతోపాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరు చేర్చేశారు. దీనికి తోడు అప్రకటిత నిబంధన అమలు చేయడంలో వెనుకాడటం లేదు. 75 ఏళ్లు దాటిన నజ్మా హెప్తుల్లాను కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా పంపారు.
బాబూలాల్ గౌర్ నుంచి ఆనందీబెన్ పటేల్ వరకు
ఇక మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న బాబూలాల్ గౌర్నూ తప్పించేశారు. ఇక ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తన వారసురాలిగా గుజరాత్ సీఎంగా నియమితులైన ఆనందీబెన్ పటేల్ కూడా ఇదే సూత్రం కింద పక్కకు తప్పుకున్నారని వినికిడి. తాజాగా కర్ణాటకలో బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ వయస్సు 84 ఏళ్లు. దీనికి తోడు బీజేపీ నాయకత్వం యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో కమలదళంలో చేరిన ఎస్ఎం కృష్ణ ఆ పార్టీ మార్గదర్శక మండల్కు పరిమితం అవుతారా? అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా బీజేపీ మార్గదర్శక మండల్ పరిణామం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఎస్ఎం కృష్ణ పలుకుబడి సొమ్ము చేసుకోవడమే కమలనాథుల వ్యూహం
ఎస్ఎం కృష్ణను పార్టీలోకి చేర్చుకోవడంలో ప్రధాన నేపథ్యంలో ఆయనకు కర్ణాటక రాష్ట్రంలో గల పునాదిని సొమ్ము చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నది. 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయాలని కలలు కంటున్న కమలనాథులు అందుకు అనుగుణంగా తమ బలాన్ని బలోపేతం చేసేందుకు వ్యూహం అనుసరిస్తున్నారు. సీనియర్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అన్న సంకేతాన్ని బీజేపీ ఇస్తున్నది. అందులో భాగంగా సీనియర్ దళిత నాయకుడు శ్రీనివాస్ ప్రసాద్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప మాట్లాడుతూ కృష్ణ రాకతో తాము మరో 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం, తర్వాత తాను సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని పేర్కొనడం గమనార్హం.
వొక్కలిగ ఓటర్లే బీజేపీ లక్ష్యం
కర్ణాటకలోని బలమైన సామాజిక వర్గ నేతల్లో ఎస్ఎం కృష్ణ ఒకరు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎస్ఎం కృష్ణ. ఒకదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీతోపాటు మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ సారథ్యంలోని సెక్యులర్ జనతాదళ్ పార్టీని బలహీన పరిచేందుకు బీజేపీ వ్యూహం అమలు చేస్తున్నది. మైసూర్ రీజియన్ నుంచి రాష్ట్ర సీఎంగా పని చేసిన ఎస్ఎం కృష్ణ ద్వారా ఈ రీజియన్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నవొక్కలిగ సామాజిక వర్గం వారి మద్దతును కూడగట్టాలని కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది. ఎస్ఎం కృష్ణ చేరికతో వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలు మరింత మెరుగు పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆయన బీజేపీలో చేరడం.. యువతను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానానికి వ్యతిరేకం కావడమే కొసమెరుపు.