కావేరీ రగడ: ఆ తర్వాతే నిర్ణయమని సిద్ధరామయ్య
బెంగళూరు: తమిళనాడుకు నీటిని విడుదల చేయాలన్న వాదనతో కర్నాటక కేబినెట్ బుధవారం నాడు విబేధించింది. కావేరీ నీటి విడుదల పైన మంత్రివర్గం ఈ రోజు భేటీ అయింది. సమావేశం అనంతరం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీలో సమావేశం ఉందని, ఆ భేటీ అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య చెప్పారు. కేబినెట్ భేటీలో మాత్రం నీటిని విడుదల చేయవద్దని నిర్ణయించారు.
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడుకు చెందిన మంత్రులు.. కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీ కానున్నారు.
గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం కానున్నామని, ఈ సమావేశంలో తమిళనాడు మంత్రులు కూడా పాల్గొంటారని, ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు.
తమిళనాడుకు మూడు రోజుల పాటు ఆరువేల క్యూసెక్కల నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం నాడు కర్నాటకను ఆదేశించింది. అయితే, కర్నాటకలోని అఖిల పక్షాల నిర్ణయం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నీటిని విడుదల చేయాలనే వాదనతో వారు ఏకీభవించలేదు.
అఖిల పక్ష సమావేశంలోను అభిప్రాయాలు తీసుకున్నామని సిద్ధరామయ్య చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి విడుదలను పోస్ట్ పోన్ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం నేపథ్యంలో నీటి విడుదల సరికాదని అన్నారు. కాగా, కావేరీ నీటిని తాగునీటికి ఉపయోగించుకోవాలని అసెంబ్లీ తీర్మానించింది.