జయలలిత కేసు, తొందరపాటు వద్దంటున్న సిద్దు !
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని సుప్రీం కోర్టుకు వెళ్లే విషయంలో ఒక నిర్ణయం తీసుకుందామని అంటున్నారు.
సోమవారం విదాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరాయ్య నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఆ సందర్బంలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే విషయంపై చర్చ జరిగింది.
ఆ సమయంలో సిద్దరామయ్య మంత్రుల అభిప్రాయాలు అడిగారని సమాచారం. న్యాయశాఖ మంత్రి టి.బి. జయచంద్ర స్పందిస్తూ అడ్వకేట్ జనరల్ ప్రోఫసర్ రవి వర్మ కుమార్, న్యాయశాఖ నిపుణులతో చర్చించి పూర్తి వివరాలు సేకరించిన తరువాత ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుందామని అన్నారని తెలిసింది.
తరువాత తుది తీర్మానం మీరు తీసుకొండి అని సిద్దరామయ్యకు ఆయన మనవి చేశారని సమాచారం. ఈ విషయంలో మంత్రి వర్గ సమావేశంలో మరో సారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన సహచరులతో అన్నారని తెలిసింది.
జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు ఏక సభ్య బెంచ్ మే 11వ తేదిన కేసు కొట్టి వేస్తు జయలలితతో పాటు మిగిలిన వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యడానికి 90 రోజుల గడువు ఉంది.