ఐటీ దాడితో కాంగ్రెస్ గూబ గుయ్ మంది: సస్పెండ్
బెంగళూరు/బెల్గాం: ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు చెయ్యడంతో ఇద్దరు ప్రభుత్వ అధికారుల రూ, కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడటంతో కర్ణాటక ప్రభుత్వం గడగడలాడింది. ప్రతిపక్షం అయిన బీజేపీ దుమ్మెత్తి పోయడంతో అధికార పార్టీ (కాంగ్రెస్) నాయకులు హడలిపోయారు.
బెంగళూరు కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర కర్ణాటక ముఖ్యమంత్రికి ఆప్తులని, అందువలనే ఇంత పెద్ద మొత్తంలో ఆ ఇద్దరు అధికారులు అక్రమ ఆస్తులు సంపాధించారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
శుక్రవారం బెళగావిలో జరిగిన శాసన సభ శీతాకాల సమావేశంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదే సమయంలో నాకు వారికి ఎలాంటి సంబంధం లేదని సీఎం సిద్దరామయ్య చెప్పారు.
చివరికి ప్రతిపక్ష నాయకుల ఆరోపణలతో సతమతం అయిన సీఎం సిద్దరామయ్య అక్రమ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న చిక్కరాయప్ప, జయచంద్రలను వారి బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు, గోవా ఆదాయ పన్ను శాఖ అధికారులు నవంబర్ 30వ తేదీన చేసిన సోదాల్లో రూ. 152 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. ఈ విషయంపై శుక్రవారం ఐటీ శాఖ అధికారులు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ దెబ్బతో ఇద్దరు అవినీతి అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.