శ్మశానంలో ఓ రాత్రి గడపనున్న కర్ణాటక మంత్రి
న్యూఢిల్లీ: గతంలో గ్రామాభివృద్ధిలో భాగంగా 'గ్రామాల్లో బస' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డి కుమారస్వామి. ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు పలు గ్రామాల్లో రాత్రిపూట బస చేశారు. ఆ రోజుల్లో ఈ కార్యక్రమానికి బాగా పాపులారిటీ వచ్చింది.
ఇప్పుడు అదే కార్యక్రమానికి కాస్త అటు ఇటుగా ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సతీశ్ జర్కిహోళి ఓ వినూత్న కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ప్రజల్లో ఉన్న మూడనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు.
డిసెంబర్ 6వ తేదీన భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, బెళగావి సిటీ కార్పోరేషన్లోని వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి మంత్రి సతీశ్ జర్కిహోళి మాట్లాడుతూ తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రముఖ అద్భుత వ్యక్తి హులికల్ నటరాజ్ పాల్గొనున్నారని చెప్పారు.