కేరళ: సీఎం స్వస్ధలంలో బీజీపే కార్యకర్తను నరికి చంపారు
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ జిల్లాలోని పినరయిలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్తను అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం 10 గంటల సమయంలో పినరయి గ్రామంలోని పెట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తిని నరికి చంపారు.
బాధితుడిని రెమిత్గా గుర్తించామని అన్నారు. బీజేపీ నేతగా ఉన్న రెమిత్ తండ్రి ఉతహ్మాన్ని కూడా సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలానే హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటన కేరళ ముఖ్యమంత్రి విజయన్ సొంత పట్టణంలో జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దుండగులు ముసుగులో వచ్చి ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో గురువారం కన్నూరు జిల్లాలో బీజీపే బంద్కు పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం సీనియర్ నాయకుడు కె. మోహనన్ (52) హత్యకు గురయ్యారు.
ఈ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన రెండో రోజే ఇదే జిల్లాకు చెందిన రెమిత్ అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు. ఈ రెండు ఘటనలతో బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కేరళలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలో మే నుంచి ఇప్పటివరకు జరిగిన రాజకీయ దాడులకు సంబంధించి 300లకు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ రెండు హత్యలు కూడా సీఎం పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మడామ్ నియోజకవర్గం పరిధిలోనే జరిగాయి.