ల్యాండ్ మాఫియా అంతు చూస్తోన్న యంగ్ ఐఏఎస్, మంత్రి నుంచి బహిరంగ బెదిరింపు
కేరళలో చట్టాన్ని అతిక్రమిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై సబ్-కలెక్టర్ శ్రీరాం వెంకటరామన్ ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ కట్టడాలను వెతికి మరీ కూల్చివేతకు సిద్ధమవుతుండడంతో ల్యాండ్ మాఫియా గజగజలాడుతోంద
తిరువనంతపురం: కేరళలో ల్యాండ్ మాఫియా గజగజలాడుతోంది. చివరికి మంత్రులు కూడా ఓ వ్యక్తి పేరు చెబితే వణికిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. శ్రీరాం వెంకటరామన్. కేరళకు చెందిన ఓ సబ్-కలెక్టర్.
కేరళలో చట్టాన్ని అతిక్రమిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై సబ్-కలెక్టర్ శ్రీరాం వెంకటరామన్(30) ఉక్కుపాదం మోపుతున్నారు. వెంకటరామన్ దెబ్బకు మున్నార్కు చెందిన మంత్రి, స్థానికంగా మంచి బలమైన నేత అయిన ఎంఎం మణి బహిరంగంగానే ఆయనను బెదిరించారు. దీనికి కారణం అక్రమ కట్టడాలను కూల్చివేయమంటూ వెంకటరామన్ ఆదేశించడమే.
నెల రోజుల్లో వెంకటరామన్ మున్నార్లో ఏకంగా 100 రిసార్ట్లకు నోటీసులు ఇచ్చారు. వాటిని పూర్తిగా ఖాళీ చేయాలని ఆదేశించారు. అంతేకాదు అక్రమ కట్టడాలను వెతికి మరీ కూల్చివేతకు సిద్ధమవుతున్నారు.
ఆయన పనితీరుపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండగా.. అధికార, ప్రతిపక్ష నేతలు సహా ల్యాండ్ మాఫియాలో వణుకు మొదలైంది. సాక్షాత్తూ మంత్రి నుంచే బెదిరింపులు రావడంపై వెంకటరామన్ స్పందిస్తూ బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. తాను భూ చట్టాన్ని అమలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
2013 కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన వెంకటరామన్ డాక్టర్ కూడా. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో ఆయన సెకండ్ ర్యాంకర్. ల్యాండ్ మాఫియాకు గుబులు పుట్టిస్తున్న వెంకటరామన్కు మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మద్దతు తెలిపారు.
మున్నార్లో దేవికుళం ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రన్ నిర్మించిన ఇల్లు కూడా అక్రమమైనదేనని, దానిని కూడా ఖాళీ చేయాల్సిందేనని సబ్-కలెక్టర్ ఆదేశించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు పూర్తయ్యాక వాటికి సర్వే నంబర్లు ఇచ్చి చట్టబద్ధం చేస్తామని వెంకటరామన్ తెలిపారు.
ఆక్రమించి కట్టుకున్న 100 రిసార్ట్లకు నోటీసులు జారీ చేయడంతో వారం రోజులుగా తనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నట్టు చెప్పారు. వెంకటరామన్ అక్రమ కట్టడాలతోపాటు లీజులో ఉన్న యాలకులు, టీ తోటలకు కూడా నోటీసులు జారీ చేశారు.