మహిళకు కిరణ్ బేడీ ముత్యాల నెక్లస్... ఆప్ నేతలు విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న కిరణ్ బేడీ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఒక మహిళకు ముత్యాల నెక్లస్ ఇస్తూ ఆమె కనిపించారు. ఆమె ఓటర్లకు లంచాలు ఇచ్చి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిరణ్ బేడీ ఓ మహిళకు ముత్యాల నెక్లస్ ఇస్తూ కనిపించారు. "వారు ప్రత్యక్షంగా నెక్లెస్లు ఇస్తూ, ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నికల నిబంధలను అతిక్రమిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది" అని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ శిశోడియా వ్యాఖ్యానించారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఢిల్లీలోని నవాడలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ‘ఇది ఎన్నికల సమయం. బీజేపీ, కాంగ్రెస్ల నుంచి అభ్యర్థులు డబ్బులిస్తాం... ఓటేయమంటూ మీ వద్దకు వస్తారు. ఆ డబ్బును వద్దనకండి. తీసుకోండి. ఎవరైనా మీ వద్దకు రాకపోతే.. మీరే వారి పార్టీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి మరీ డబ్బులు వసూలు చేయండి. ఆ రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆప్కే వేయండి' అని అన్నారు.
‘గత 65 ఏళ్లుగా మనల్ని పిచ్చోళ్లను చేస్తున్న ఆ నేతలను ఈ సారి మనం ఫూల్స్ చేద్దామ'న్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో ఓటర్లకు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం. ఇక ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 7న జరగనున్నాయి. ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 10న వెల్లడించనున్నారు.