కలుస్తా: తనను పొగిడిన ఏఏపీ నేతకు బేడీ, ఎందుకని శాంతిభూషణ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు శాంతిభూషణ్ తన పైన ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శుక్రవారం స్పందించారు. క్రిష్ణానగర్ ప్రచారంలో ఉన్న ఆమె మాట్లాడారు. కలుసుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శాంతిభూషణ్ను ఆమె కోరారు. అయితే, కిరణ్ బేడీ విజ్ఞప్తిని శాంతిభూషణ్ తిరస్కరించినట్లుగా కనిపిస్తోంది.
కిరణ్ బేడీ కలుసుకునేందుకు చూస్తున్నారన్న వ్యాఖ్యల పైన ఆయన మాట్లాడుతూ.. అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని చెప్పారు. ఆమెను తాను ఎందుకు కలవాలని ప్రశ్నించారు.
కాగా, ఢిల్లీ వీధుల్లో ఎన్నికల ప్రచార హోరు మరింత ఊపందుకుంది. కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాను పోటీ చేయనున్న కృష్ణానగర్ నియోజకవర్గంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓటర్లందరినీ పలకరిస్తూ బీజేపీని గెలిపించాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఆప్ వ్యవస్థాపక సభ్యుడు ప్రశాంత్ భూషన్ను కలిసి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాల్సిందిగా కోరనున్నారు.
ఏఏపీ వ్యవస్థాపక సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది శాంతి భూషణ్ బీజేపీని, ఇటీవల ఆ పార్టీలో చేరిన కిరణ్ బేడీని ప్రశంసించడం ద్వారా దుమారం లేపిన విషయం తెలిసిందే. కిరణ్ బేడీని చేర్చుకోవడం ద్వారా బీజేపీ గొప్ప కౌశలాన్ని ప్రదర్శించిందన్నారు.
అన్నాహజారే సాగించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్తో కలిసి ఆమె పాల్గొన్నారని, ఆ ఉద్యమంలో ఆమె ప్రభావవంతమైన పాత్ర నిర్వహించారని, అందువల్ల ఆమెను తీసుకొచ్చి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ గొప్ప కౌశలాన్ని ప్రదర్శించిందని నేను భావిస్తున్నానని శాంతి భూషణ్ అన్నారు.
ఏఏఫీ వేస్తున్న ప్రతి అడుగు సరైంది కాదని, పార్టీ పనితీరును పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాజకీయ వ్యవస్థను సంస్కరించుకోవాలని, రాజకీయ ప్రమాణాలను మెరుగు పరచుకోవాలన్నారు. ఏఏపీ ఏ లక్ష్యాల కోసం అయితే ఏర్పడిందో ఆ లక్ష్య సాధన దిశలో ముందుకు సాగడం లేదన్నారు.
అయితే శాంతి భూషణ్ వ్యాఖ్యలపై ఏఏపీ ఆచితూచి స్పందించింది. శాంతి భూషణ్ వ్యాఖ్యలు తమ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వెల్లడిస్తున్నాయని, ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఏఏపీ సమన్వయకర్త ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.