విదేశీయుల ఎస్టేట్ రూ. 7 కోట్లకు తీసుకున్న జయలలిత: హత్య, శశికళ చేతిలో !
ఇంగ్లాండ్ కు చెందిన ఓ కుటుంబ సభ్యుల నుంచి రూ. 7 కోట్లకు జయలలిత కొడనాడు ఎస్టేట్ తీసుకున్నారు. ప్రస్తుతం కొడనాడు ఎస్టేట్ విలువ రూ. 200 కోట్లు ఉంది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు కబ్జా చేసేందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను హత్య చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
జయలలితకు అత్యంత నమ్మకస్తుడైన ఓం బహదూర్ గత 30 ఏళ్ల నుంచి కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నేపాల్ కు చెందిన ఓం బహదూర్ హత్య కేసులో అదే ఎస్టేట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న కృష్ణ బహదూర్ ప్రధాన సాక్షి అని పోలీసు అధికారులు అంటున్నారు.
టైట్ సెక్యూరిటీ
దుండగుల చేతిలో తీవ్రగాయాలైన వాచ్ మెన్ కృష్ణ బహదూర్ కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణ బహదూర్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
బంగ్లాలో చోరీ జరిగింది !
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన దుండగులు బంగ్లాలో విలువైన వస్తువులు, పత్రాలు చోరీ చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత విలువైన వస్తువులు, పత్రాలు చోరీ అయ్యాయి అని అధికారులు ఆరా తీస్తున్నారు.
గేట్ నెంబర్ 10 నుంచి లోపలికి
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సోమవారం వేకువ జామున గేట్ నెంబర్ 10 నుంచి దుండగులు లోపలికి ప్రవేశించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. హంతకులను వాచ్ మెన్ కృష్ణ బహదూర్ గుర్తు పట్టే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
జయలలిత బంగ్లాకు నిప్పు
చెన్నై నగర శివార్లలోని సిరుతాపూర్ లోని జయలలిత బంగ్లాలో వారం క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్నిప్రమాదంలో విలువైన ఆస్తుల పత్రాలు బూడిద అయ్యాయని తెలిసింది. జయలలితకు సంబంధించిన ఆస్తుల పత్రాలు అన్నీ మాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని అమ్మ అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇంగ్లాండ్ ఫ్యామిలీ
ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ కుటుంబ సభ్యుల నుంచి గతంలో కేవలం రూ. 7 కోట్ల రూపాయలకు జయలలిత కొడనాడు ఎస్టేట్ కొనుగోలు చేశారు. ఈ కొడనాడు ఎస్టేట్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 200 కోట్లకుపైగా ఉంది.
శశికళ ఫ్యామిలీ చేతిలోనే
కొడనాడు ఎస్టేట్, సిరుతాపూర్ బంగ్లా, చెన్నైలోని పోయెస్ గార్డెన్, హైదరాబాద్ లోని ద్రాక్ష తోట ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంది. జయలలిత కుటుంబ సభ్యులను ఈ ఆస్తుల దరిదాపులోకి రానివ్వడం లేదు.
ప్రత్యేక బృందంతో విచారణ
జయలలిత ఎస్టేట్ లో హత్య జరగడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమ్మ ఎస్టేట్ లోనే హత్య జరగడంతో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.