రామ్ నాథ్ కోవింద్ మీటింగ్: పక్కనే బీజేపీ మాజీ మంత్రి పై కార్యకర్తల దాడికి యత్నం!
బెంగళూరు: ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రామ్ నాథ్ కోవింద్ బుధవారం బెంగళూరు వచ్చారు. బుధవారం రాత్రి బెంగళూరు నగరంలోని ఏట్రియా హోటల్ లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని రామ్ నాథ్ గోవింద్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మనవి చేశారు.
హోటల్ లోపల రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతున్న సమయంలో కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని మహదేవపుర ఎమ్మెల్యే, రామ్ నాథ్ కోవింద్ బెంగళూరు పర్యటన ఇన్ చార్జ్ అరవింద లింబావలి హోటల్ దగ్గర కు వెళ్లారు. రామ్ నాథ్ కోవింద్ ను కలవడానికి వెలుతున్న మాజీ మంత్రి అరవింద లింబావలిని కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామ్ నాథ్ కోవింద్ వర్గానికి చెందిన కోలి కులం నాయకులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి అదే హోటల్ దగ్గరకు వచ్చారు. రామ్ నాథ్ కోవింద్ ను కలిసి కోలి కులం వారు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని మనవి చెయ్యడానికి ప్రయత్నించారు.
అయితే కోలి కులానికి చెందిన నాయకులు రామ్ నాథ్ కోవింద్ ను కలవకుండా రాష్ట్రపతి అభ్యర్థి పర్యటన ఇన్ చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవింద లింబావలి అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆయన కూడా రామ్ నాథ్ కోవింద్ ను కలవకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి అరవింద లింబావలి మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.
అక్కడే ఉన్న పోలీసులు మాజీ మంత్రి అరవింద్ లింబావలిని కట్టుదిట్టమైన భద్రతతో హోటల్ బయటకు తీసుకెళ్లారు. కోలి కులం నాయకులు అరవింద లింబావలి వాహనంపై దాడికి దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే రామ్ నాథ్ కోవింద్ బెంగళూరు పర్యటన సందర్బంలో బీజేపీ కార్యర్తలు ఏ నాయకుడి మీద దాడి చెయ్యలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్పష్టం చేశారు.