కుల్ భూషణ్ జాదవ్ ఇష్యూ: తల్లి అప్పీలు తిరస్కరించిన పాక్, రాయబారి చర్చలూ విఫలం, తర్వాతేంటి?
కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్ష రద్దు విషయంలో అన్ని దారులూ మూసుకుపోయాయి. చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్య ఏమిటనేది ఆసక్తిగా మారింది.
న్యూఢిల్లీ:మరణ శిక్షకు గురైన భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించడంతోపాటు, ఒకమారు కలుసుకునే అవకాశం కల్పించాలన్న అతని తల్లి నివేదనను పాక్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
బుధవారం పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనా జాంగ్వాతో భారత రాయబారి గౌతం బంబావాలే జరిపిన చర్యలు కూడా విఫలమయ్యాయి. భారత నౌకాదళం మాజీ ఉద్యోగి కుల్ భూషణ్ యాదవ్ ను గూఢచారిగా పేర్కొంటూ పాక్ ఆర్మీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్ష రద్దు కోసం భారత్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కుల్ భూషణ్ భవితవ్యంపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కన్నతల్లి రోదించినా.. కనికరం చూపలేదు
పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 133(బి) ప్రకారం.. ఆర్మీ కోర్టు విధించే శిక్షలను రద్దుచేసే అవకాశం పాక్ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రకారమే తన కొడుకు విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కుల్ భూషణ్ తల్లి.. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. కన్నకొడుకును చూసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రాధేయపడింది.
ఈ మేరకు ఆమె చేసుకున్న అప్పీలు పత్రాలను భారత రాయబారి గౌతం బాంబావాలే.. పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మీనాకు అందించారు. దీనిపై తెహ్మీనా బదులిస్తూ 'సాధారణ ఖైదీల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉండేదేమో, కానీ, గూఢచారుల విషయంలో, వారికి విధించిన శిక్షల విషయంలో మేమేం చెయ్యలేం..'అని తేల్చి చెప్పారు.
కుల్ భూషణ్ జాదవ్ మరణశిక్ష రద్దు విషయంలో అన్ని దారులూ మూసుకుపోయాయి. ఈ చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్య ఏమిటనేది ఆసక్తిగా మారింది.