రూ. 100 అడిగినకార్మికుడు: చంపేసిన కాంట్రాక్టర్
ఆగ్రా: కష్టపడి కూలి పని చేసి ఆ నగదు తీసుకోవడానికి వెళ్లిన కార్మికుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆగ్రాలోని కత్రా వాజిర్ ఖాన్ ప్రాంతంలో జరిగింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న పప్పు (40) అనే కార్మికుడు హత్యకు గురైనాడు.
హత్యకు గురైన పప్పు కుటుంబ సభ్యులు, బంధువుల దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన రిటైర్డ్ మేజర్ ఎం.ఎల్ ఉపాధ్యాయ సరోజిని నాయుడు మెడికల్ కాలేజ్ లోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పోందుతున్నాడని ఆగ్రా సీనియర్ పోలీసు అధికారి డి. రాజేష్ చెప్పారు.
రిటైర్డ్ మేజర్ ఉపాధ్యాయ మనుమడు జై క్రిషన్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఇతని దగ్గర అనేక మంది కూలి పని చేస్తున్నారు. పప్పు జై క్రిషన్ దగ్గర పని చేస్తున్నాడు. పప్పు దళితుడు. ఇతను ప్రతి రోజు పని చేస్తే రూ. 100 కూలి వస్తుంది. మంగళవారం పప్పు జై క్రిషన్ దగ్గరకు వెళ్లాడు. తాను పని చేసినందుకు రూ. 100 ఇవ్వాలని అడిగాడు.
ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. సహనం కోల్పోయిన జైక్రిషన్ చేతికి చిక్కిన పెద్ద కర్ర తీసుకుని పప్పును చితకబాదాడు. తల, ముక్కు, చెవులలోంచి ఎక్కువ రక్తం పోవడంతో జై క్రిషన్ హడలిపోయాడు. అతనే పప్పును ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుండి పరారైనాడు
చికిత్స విఫలమై పప్పు మరణించాడు. విషయం తెలుసుకున్న పప్పు కుటుంబ సభ్యులు దలిత సంఘాలు జైక్రిషన్ ఇంటిని ద్వంసం చేశారు. రెండు వాహనాలకు నిప్పంటించారు. ఫర్నిచర్ ద్వంసం అయ్యింది. రిటైడ్ మేజర్ ఉపోధ్యాయను చితకబాదారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేశారు. పరిస్థతి విషమించడంతో రబ్బర్ బుల్లెట్ లతో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. సంఘటనా స్థలంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.