లేదంటే నితీష్కు చుక్కలు చూపేవాడ్ని, రెండుసార్లు కాపాడా: లాలూ
పాట్నా: జనతా పరివార్ విలీనం పైన అస్పష్టత తొలిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలుకనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేడీయూ, ఆర్జేడీలు విలీనమై వెళ్లాలా లేక సీట్ల సర్దుబాటు చేసుకొని వెళ్లాలా అనేది త్వరలో నిర్ణయిస్తామని ఆర్జేడీ అధ్యక్షులు లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.
ఆయన బుధవారం నాడు విలేకరులతో మాట్లాడారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అంశంపై చర్చలు ఆగిపోయినట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.
కానీ, హఠాత్తుగా సమస్య పరిష్కారం కాదన్నారు. ఛూమంతర్ అంటే సమస్య పరిష్కారం కాదన్నారు. నితీష్ కుమార్, ఇతరులు కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విలీనమా లేక సీట్ల సర్దుబాటు వెళ్లాలా, సింబల్ ఏది ఉండాలి అనే అంశాలపై తాము ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఇవన్నీ పెద్ద సమస్యలన్నారు.
నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తమ ముందుకు ఇప్పటి వరకు ప్రతిపాదనే రాలేదని చెప్పారు. సరైన సమయంలో తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ ముందున్న ముఖ్య లక్ష్యం బీజేపీని ఓడించడమని, అంతే కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తమకు అనవసరమన్నారు.
తాను స్వచ్ఛమైన మనస్సుతో నితీష్కు మద్దతిస్తున్నానని చెప్పారు. తన ఉద్దేశ్యం మరో రకంగా ఉంటే, ఇప్పటికే రెండుసార్లు నితీష్ కుమార్ను ముంచేవాడినని అభిప్రాయపడ్డారు. తొలిసారి ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత రాజ్యసభ సీట్ల విషయంలో తాను నితీష్కు అండగా నిలిచానని చెప్పారు. తాము ఇప్పటికీ జేడీయూ వెంటే ఉన్నామని చెప్పారు.