భార్యకు 'నో ఛాన్స్'.. కుమార్తెను నామినేట్ చేసిన లాలూ
పాట్నా : దేశంలో రాజ్యసభ ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీహార్ లోను రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు పలువురు నేతలు.
ఇందులో భాగంగానే.. లాలూ భార్య రబ్రీదేవిని ఆర్జేడీ తరుపున రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలకు తెరదించుతూ కూతురు మిసా భారతి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కోర్టు కేసుల్లో తన తరుపున వాదించి తనను చిక్కుల్లో నుంచి బయటపడేసిన రాంజెఠ్మాలనీని కూడా ఆర్జేడీ తరుపున రాజ్యసభకు నామినేట్ చేశారు.
ముందునుంచి ఆర్జేడీ తరుపున లాలూ భార్య రబ్రీదేవికే అవకాశం దక్కుతుందని అంతా భావించినా.. చివరి నిముషంలో సస్పెన్స్ కు తెరదించుతూ కుమార్తె మిసా భారతిని లాలూ నామినేట్ చేశారు.
ఇక రాంజెఠ్మాలనీ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ తో పాటు, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు నామినేట్ చేసినందుకు గాను ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు రాంజెఠ్మాలనీ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాలూ ప్రసాద్ కు తాను స్నేహితుడినని, అలాగే రక్షకుడిని కూడా అని తెలిపారు.
ఇకపోతే బీజేపీ తరుపున ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ సింగ్ ని పార్టీ తరుపున రాజ్యసభకు నామినేట్ చేసింది. బీహార్ తరుపున రాజ్యసభలో ఖాళీ అవనున్న ఐదు స్థానాల కోసం ఈ నేతలు పోటీ పడనున్నారు.