షాకింగ్: లాలూ ప్రసాద్కు రూ.10వేల పింఛను, ఇదీ కారణం..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నెలకు రూ.10వేల పింఛను తీసుకోనున్నారు. అంతేకాదు, 2009 నుంచి ఈ రోజు వరకు బకాయిలు కూడా ఆయనకు అందనున్నాయి.
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ నెలకు రూ.10వేల పింఛను తీసుకోనున్నారు. అంతేకాదు, 2009 నుంచి ఈ రోజు వరకు బకాయిలు కూడా ఆయనకు అందనున్నాయి.
లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ సేనాని సమ్మాన్ పింఛను పథకం కింద దరఖాస్తు చేసుకున్న లాలుకు నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ పింఛను మంజూరు చేయడం గమనార్హం.
లాలూకు రూ.10వేల పింఛను
జేపీ సేనాని సమ్మాన్ పింఛను పథకంలో భాగంగా లాలూ ప్రసాద్ నెలకు రూ.10వేల నగదును పొందేందుకు అర్హుడని తాజాగా బీహార్ ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద పింఛను పొందడానికి లాలూ చేసుకున్న దరఖాస్తును పరిశీలించామని, అది అర్హతకు తగ్గట్టుగా ఉండటంతో ఆమోదించినట్లు అధికారులు చెబుతున్నారు.
సంపూర్ణ క్రాంతి ఉద్యమం
1974లో జయప్రకాశ్ నారాయణ్ 'సంపూర్ణ క్రాంతి' ఉద్యమం ప్రారంభించిన సమయంలో లాలూ విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఆయన మిసా (నిర్వహణ అంతర్గత భద్రత చట్టం) కింద జైలుకి వెళ్లారు.
లాలూ అర్హులు
అయితే 2015లో సవరించి తెచ్చిన ఈ పథకం ప్రకారం నెలవారీ పింఛను పొందడానికి లాలూ అర్హుడు. నిబంధనల ప్రకారం నెల నుంచి ఆరు నెలల వరకు జైలులో ఉన్నవారికి రూ.5వేలు, ఆరు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన వారికి రూ.10వేలు పింఛనుగా పొందుతారు. ఈ నిబంధనల ప్రకారం లాలూ రూ.10 వేల పింఛను పొందేందుకు అర్హుడని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీల విస్మయం
నితీష్ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,500 మందికి ఈ పింఛను ఇస్తోంది. అయితే ఈ పింఛను కావాలని సాక్షాత్తు లాలూ ప్రసాద్ యాదవ్ దరఖాస్తు చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. పశువుల దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవించిన లాలూ.. ఈ పింఛనుకు దరఖాస్తు చేసుకోవడం ఏమిటని అంటున్నారు.