దావూద్పై కన్నేశాం, పాక్ బాధ్యత , ఏంచేస్తామో చూడండి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన సమాచారం యావత్తు భారత ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం అన్నారు. దావూద్ వ్యవహారంలో విదేశీ దౌత్యం, రాజకీయ చొరవను భారత్ కోరుతుందని చెప్పారు. దావూద్ కదలికలు, కార్యకలాపాల పైన ఓ కన్నేసి ఉంచామన్నారు. దావూద్ భారత్ అత్యంత తీవ్రంగా అన్వేషిస్తున్న తీవ్రవాది అని, అతడిని అప్పగించాలని పదేపదే పాకిస్తాన్ను కోరుతున్నామన్నారు.
ఇంతకీ అతడిని ఎప్పుడు పట్టుకుంటారని విలేకరులు ప్రశ్నించగా.. వేచి చూడాలన్నారు. దావూద్ విషయంలో ఏం చేయాలనే విషయాన్ని కేంద్రం త్వరలో నిర్ణయిస్తుందన్నారు. దావూద్ను అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ శనివారం కూడా కోరింది. ఆయన కరాచీలో ఉన్నట్లు స్పష్టంగా తెలుసునని కేంద్ర హోంశాశ సహాయమంత్రి కిరణ్ రిజిజు వేరుగా చెప్పారు. అతడికి వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు ఇచ్చామన్నారు. ఇప్పుడిక అతడిని అప్పగించడం పాక్ వంతు అన్నారు.
దావూద్ ఇబ్రహీంను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్ను డిమాండ్ చేసింది. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉంటున్నాడనడానికి సంబంధించిన పలు సాక్ష్యాలను పాకిస్తాన్కు అప్పగించిన తరువాతే అతన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేసినట్టు రిజిజు తెలిపారు.
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు
పాకిస్తాన్ సైన్యాలు శనివారం జమ్మూ, కతువా జిల్లాల్లో భారత్-పాక్ సరిహద్దుల వెంబడి రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో బీఎస్ఎఫ్ సైతం అదే స్థాయిలో పాక్ కాల్పులను తిప్పికొట్టింది. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది నాలుగోసారి.
గత రాత్రి పొద్దుపోయాక జమ్మూ జిల్లాలోని ఆర్నియా సబ్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న విక్రమాన్ సైనిక స్థావరంపై పాక్ సైన్యాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడినట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ కాల్పులు తెల్లవారుజామున 1.30 గంటల దాకా కొనసాగినట్లు ఆయన చెప్పారు.
ఇరుపక్షాల కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరూ గాయపడ్డం కానీ జరగలేదని ఆయన తెలిపారు. కతువా జిల్లా హీరానగర్ సెక్టార్లోని జబోవాల్ స్థావరంపై కూడా పాక్ సైనికులు ఇదే తరహాలో కాల్పులు జరిపారని, అయితే కొద్దిసేపు మాత్రమే సాగిన ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టంకానీ, గాయపడ్డం కానీ జరగలేదన్నారు.