శశికళకు ప్రాణహాని: రెండో రోజు జైలులో చలాకీగా..
శశికళకు బెంగళూరు జైలులో ప్రాణహాని ఉందని అంటూ ఆమెను చెన్నై జైలుకు తరలించాలని న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు చేరిన అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రాణహాని ఉందని అంటూ, చెన్నై జైలుకు మార్చాలని కోరుతూ న్యాయవాదులు ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బుధవారం పరప్పన్ అగ్రహార జైలుకు చేరిన శశికళను ఏ విధంగానైనా చెన్నైకి బదిలీ చేయించాలనే వ్యూహాలు అదే రోజు రాత్రి నుంచే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
గురువారం తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం ఉండడంతో అన్నాడియంకె నాయకులు బిజీగా గడిపారు. గురువారం రాత్రికే శశికళ భర్త నటరాజన్ బెంగళూరుకు చేరుకుని సుమారు 40 మందికిపైగా న్యాయవాదులతో చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పరప్పన అగ్రహార జైలు అధికారులకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. శశికళకు ప్రాణహాని ఉందని తగిన భద్రత కల్పించాలని నిఘా వర్గాలు జైలు అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఘావర్గాల సమాచారాన్ని ముందుంచుకున్న శశి న్యాయవాదులు, పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై జైలుకు మార్పు చేయాలని శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఉదయం నటరాజన్ జైలుకు వెళ్ళి శశికళను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. పరప్పన అగ్రహార జైలులో ఉంటే తమిళ రా జకీయాలను నడపడం సాధ్యం కాదని, దానికితోడు కేవలం ఖైదీగా మాత్రమే గడపాల్సి ఉంటుందని అదే చెన్నై జైలులో అయితే ఎలా ఉన్నా ఎదురు ఉండదని శశికళ ఆలోచనగా చెబుతున్నారు. కోర్టులో శశికళ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్ విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియడం లేదు..
పరప్పన అగ్రహార జైలుకు చేరిన శశికళ తొలిరోజు బుధవారం దిగులుగా ఉన్నట్లు తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా పొద్దుపోయేదాకా మేల్కొని ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం నుంచే ఆమె సంతోషంగా, చలాకీగా ఉన్నట్లు తెలిసింది.