ట్రంప్ ఒత్తిడి టైంలోను..: భారత్లో ఎఫ్ 16 యుద్ధ విమానాల తయారీ
అత్యాధునిక ఎఫ్ 16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టిఏఎస్ఎల్), అమెరికన్ ఏరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్యారిస్: అత్యాధునిక ఎఫ్ 16 యుద్ధ విమానాలను సంయుక్తంగా భారత్లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టిఏఎస్ఎల్), అమెరికన్ ఏరో స్పేస్ దిగ్గజం లాక్ హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్యారిస్ ఎయిర్ షో సందర్భంగా కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఈ డీల్ ప్రకారం లాక్ హీడ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్ట్ వర్త్లో ఉన్న ప్లాంటు కార్యకలాపాలను భారత్కు తరలించనుంది.
ఈ క్రమంలో అక్కడి అమెరికన్ల ఉద్యోగుల ఉపాధికి ప్రత్యక్ష భంగం కలగకుండా చర్యలు తీసుకుంది. భారత వాయు సేనకు అవసరమయ్యే యుద్ధ విమానాల లోటును తీర్చే బిలియన్ డాలర్ల ఆర్డర్ను ఆ సంస్థ పొందనుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో జూన్ 26న భేటీ కానున్నారు. దీనికి ముందుగా ఈ ఒప్పందం జరగడం గమనార్హం. అమెరికా కంపెనీలు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు.
ఇలాంటి సమయంలో లాక్దీద్ భారత్లో ఎఫ్ 16 యుద్ధ విమానాల తయారీకి అంగీకరించడం మరో విశేషం. అయితే ఈ ఒప్పందం కారణంగా భారత్తో పాటు అమెరికాలోను ఉద్యోగ అవకాశాలు ఉంటాయని రెండు సంస్థలు తెలిపాయి.