మంత్రుల్ని పరిచయం చేసిన మోడీ, ఎంపీ కొత్త ప్రమాణం
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మురళీ దేవరాతో పాటు ఇటీవల మృతి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలు, ప్రముఖులకు పార్లమెంట్ ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. జమ్మూకాశ్మీర్ వరదల్లో మృతి చెందిన వారికి, ఆంధ్రప్రదేశ్లో హుధుద్ తుపాను మృతులకు లోకసభ సంతాపం ప్రకటించింది.
ఉభయసభల్లో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఉభయ సభలు (మంగళవారానికి వాయిదా పడ్డాయి. అంతకుముందు లోకసభలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో సభాపతి సుమిత్రా మహాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం కొత్తగా పదవులు చేపట్టిన కేంద్రమంత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు పరిచయం చేశారు.
ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో తెలంగాణ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట్ర నుండి ప్రీతమ్ ముండే, ఉత్తర ప్రదేశ్ నుండి తేజ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
అంతకుముందు పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు ఉదయం చేరుకున్నారు. కారు దిగిన వెంటనే పార్లమెంటు ఆవరణలో ఉన్న మీడియాతో మాట్లాడారు.
దేశాన్ని పాలించాలని ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని, వారి ఆశలను నెరవేరుస్తామన్నారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. విపక్షాల సహకారంతోనే చివరి పార్లమెంటు సమావేశాలు విజయవంతంఅయ్యాయని తెలిపారు. అందరం కలసి దేశ అభివృద్ది కోసం పాటుపడదామన్నారు.
పప్పులు ఉడకవనే: కవిత
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పైన గళం ఎత్తుతామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చెప్పారు. ఉద్యోగుల విభజన సహా కేంద్రం వద్ద కొన్ని పెండింగులో ఉన్నాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన స్పందిస్తూ.. చంద్రబాబు, టీడీపీ వెకిలి ప్రయత్నం చేస్తోందని, ఆ పప్పులు ఏం ఉడకవని, దానిని వ్యతిరేకిస్తూ శాసన సభ తీర్మానం చేసిందన్నారు.