హిందువులు తినడం లేదా?: రాందేవ్ను లాగిన లాలూ
న్యూఢిల్లీ: యోగాగురు రాందేవ్ బాబా ఆర్ఎస్ఎస్ను మంచిన కరుడుగట్టిన హిందూత్వవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయబోతున్న ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాపై మాటల దాడి మొదలుపెట్టారు.
బీహార్ లో ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు.
అంతేకాదు ఆయన తయారుచేసే ఔషధాల్లో పశువుల ఎముకలు కలుపుతున్నారని సీపీఎం నేత బృందాకారత్ అన్న విషయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు పశువుల ఎముకలైనా తేడా ఏముందని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్లోని దాద్రి సమీపంలోని ఓ గ్రామంలో మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తిని పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా లాలూ స్పందించారు. హిందువులు పశుమాంసం తినడం లేదా అంటూ ప్రశ్నించారు. విదేశాల్లోని ప్రజలు పశుమాంసం తింటున్నప్పుడు అందులో తప్పేముందన్నారు.
రాందేవ్ బాబాకు చెందిన పతంజలి కంపెనీ తయారు చేస్తున్న ఔషధాల్లో గతంలో మనుషుల, పశువుల ఎముకలు కలుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని 2006లో రాందేవ్ బాబా కొట్టిపారేశారు.
వచ్చే వారంలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.