విషాదం: ఊర కుక్క దాడిలో కాలు కోల్పోయిన గర్భవతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బరేలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుక్క బెడద తీవ్రంగా ఉంది. తాజాగా, ఓ ఊర కుక్క దాడిలో గర్భవతి అయిన మహిళ తన కాలిని కోల్పోయింది. మహిళ కేకలు ఉన్న గ్రామస్థులు వెదురుబొంగులతో కుక్కలను తరిమి, మహిళను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆమె ఓ కాలును కోల్పోయింది. బాధితురాలిని లలితగా గుర్తించారు.
గత నెల రోజుల వ్యవధిలో కుక్కలు ఐదుగురు పిల్లలను చంపేశాయి. పది మందిని గాయపరిచాయి. ఓ ఊర కుక్క ఎనిమిదేళ్ల బాలికపై ఆదివారం అమ్రోహాలోని హసన్పూర్ తెహిసీల్లో దాడి చేసి, ఆమెను చంపేసింది. ఊర కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలను, మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం అచ్చయింది.
వాటి మెడలకు తాడు లేదా కాలర్ వేయాలని ప్రస్తుతం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే హోలీ తర్వాతనే ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. కుక్కలు హింసాత్మకంగా మారడానికి ఆ ప్రాంతంలో ఎక్కువ పశువుల వధకు సంబంధించిన కర్మాగారాలు ఉండడమేనని అంటున్నారు.
దుకాణాల్లో ఇక్కడ పెద్ద యెత్తున బిర్యానీ విక్రయిస్తున్నారు. మిగిలిన బిర్యానీని కుక్కలకు వదిలేస్తారు. దాంతో అవి మాంసం తినడానికి మరిగాయి. తమకు సరైన ఆహారం లభించనప్పుడు అవి పిల్లలపై దాడులకు ఎగబడుతున్నాయి.