మరుగుదొడ్డి నిర్మించలేదని కాపురానికి భార్య నో
భోపాల్: ఇంట్లో టాయిలెట్ కోసం మహిళలు ఇటీవల అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించడం, భర్తతో కాపురం చేసేందుకు ససేమీరా అంటోండటం మనం ఇటీవల చూస్తున్నాం. అలాంటి సంఘటనే మరొకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
సీమా (20) అనే మహిళ అత్తగారింట్లో మరుగుదొడ్డి నిర్మించలేదని ఏడాదిన్నర క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలంటూ భర్త అభ్యర్థించాడు. అయితే, ఆయన అభ్యర్థనలను ఆమె ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది.
దీంతో భర్త మోహన్(23) షాపూర్ జిల్లాలోని కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఆశ్రయించి తన కాపురాన్ని నిలబెట్టాలని కోరారు. ఈ కేసును పరిశీలించిన కౌన్సిలింగ్ సభ్యుడు రజని గైక్వాడ్.. సీమా వాదనలో న్యాయముందని నెల రోజుల్లోగా మరుగుదొడ్డి నిర్మించి భార్యను కాపురానికి తెచ్చుకోవాలని మోహన్కు సూచించారు.
2012లో వివాహం జరిగిన నాటి నుంచి మరుగు దొడ్డి కట్టించాలని ఎంత చెప్పినా వారు పెడచెవిన పెట్టారని, దీంతో సీమా 19 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయారని గైక్వాడ్ చెప్పారు.
కాగా, అంతకుముందు 2011లో మధ్యప్రదేశ్లోని చిచౌలీ గ్రామంలో అనితా నరే అనే గిరిజన మహిళ మెట్టినింట్లో మరుగుదొడ్డి నిర్మించని కారణంగా.. పుట్టింటికి వెళ్లిపోవాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అనిత ధైర్యాన్ని ప్రశంసిస్తూ సులబ్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఆమెకు రూ.5 లక్షల అవార్డు ప్రకటించారు.