జల్లికట్టు-త్రిష ఎఫెక్ట్: రంగంలోకి శశికళ, పన్నీరు సెల్వంకు షాక్
జల్లికట్టు కోసం తమిళనాట నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెటా పైన ఆగ్రహం పెల్లుబుకుతోంది.
చెన్నై: జల్లికట్టు కోసం తమిళనాట నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెటా పైన ఆగ్రహం పెల్లుబుకుతోంది. పెటాను నిషేధించేందుకు న్యాయపరంగా తీసుకోవాల్సిన అన్నింటిని పరిశీలిస్తామని తాజాగా అన్నాడీఎంకే చీఫ్ శశికళ చెప్పారు. అంతేకాదు, జల్లికట్టు పైన ఆర్డినెన్స్ కూడా జారీ చేయాలని శశికళ కోరుతున్నారు.
ఇంతకుముందే, డీఎంకే చీఫ్ స్టాలిన్ పెటాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష మాట్లాడిన నేపథ్యంలో పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
జోక్యం చేసుకోమన్న హైకోర్టు
జల్లికట్టు విషయంలో జోక్యం చేసుకోలేమని మద్రాస్ హైకోర్టు బుధవారం చెప్పింది. ఇప్పటికే ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున తాము (హైకోర్టు) లేదా ప్రభుత్వం జోక్యం చేసుకోవని చెప్పారు.
ఆర్డినెన్స్ జారీ చేయాలని పన్నీరు సెల్వం
జల్లికట్టు పైన సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేయాలని పన్నీరు సెల్వం రేపు ప్రధానిని మోడీని కలిసి కోరనున్నారు.
పన్నీరు సెల్వంకు నిరసనకారుల షాక్
ఆందోళనకారులు నిరసనలు ఆపాలని పన్నీరు సెల్వం బుధవారం విజ్ఞప్తి చేశారు. అయితే, నిరసనకారులు మాత్రం పన్నీరు సెల్వం మాట లెక్క చేయలేదు. ఆందోళనలు కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. జల్లికట్టు నిర్వహించే వరకు నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.
ఆందోళనలు ఉధృతం
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించిన నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్ధృత రూపం దాల్చుతోంది. మంగళవారం రాత్రి నుంచి చెన్నై మెరీనా బీచ్ వద్దకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
చర్చలు విఫలం
బుధవారం వేకువజామునే ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీచేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపుతామని, ఆందోళన విరమించాలని పలువురు మంత్రులు కోరినప్పటికీ, వారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌఖిక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అయితే, మౌఖిక ప్రకటన చేయడం కుదరదని, సీఎం దానిపై ఓ లిఖితపూర్వక ప్రకటన విడుదల చేస్తారని ఆందోళనకారులకు స్పష్టం చేశారు. జల్లికట్టు విషయమై త్రిష, పెటా పైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
రేపు రాష్ట్రపతి, ప్రధానితో ఎంపీల భేటీ
విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో గురువారం సమావేశం కానున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని వారిని కోరనున్నారు.
ఆందోళనలో నటులు
జల్లికట్టుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ సినీనటులు సూర్య, విజయ్ ప్రకటనలు విడుదల చేయగా, నృత్య దర్శకుడు లారెన్స్ రాఘవ ఆందోళనకారులతో కలిసి మెరీనాబీచ్లో బైఠాయించారు.