రిపబ్లిక్ వేడుకల్లో 'మహా' పొరపాటు: అదే వేదికపై సీఎం, గవర్నర్
ముంబై: మహారాష్ట్రలో గణతంత్ర వేడుకల్లో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల మహారాష్ట్ర అధికార యంత్రాంగం విమర్శలకు గురైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65వ రిపబ్లిక్డే వేడుకలంటూ బ్యానర్ కట్టారు. సోమవారం జరిగిన గణతంత్ర వేడుకలు 66వవి. కానీ, వారు 65వ గణతంత్ర వేడుకలు అంటూ రాశారు.
చారిత్రక శివాజీ పార్కువద్ద ఈ బ్యానర్ వెలసింది. ఈ విషయాన్ని శివసేన రాష్ట్ర కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ గుర్తించారు.ప్రతిపక్ష పార్టీలన్నీ తమ కెమేరాలతో బ్యానర్ను ఫొటోలు తీసేశారు. ప్రతిపక్ష ఎన్సీపీ దీనిపై భగ్గుమంది. ఇది ఘోరమైన తప్పిదమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తక్షణం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఎన్సీపీ అధికారి ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
శివాజీ పార్క్ వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ విద్యాసాగర రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్ముఖ్, అసెంబ్లీ స్పీకర్ హరిభాహూ బాగ్డే, ముంబై మేయర్ స్నేహల్ అంబేద్కర్ సహా పలువురు ప్రముఖులు హాజరైన వేదిక వద్దే ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.
దీనిపై శివసేన నేత స్వాధీన్ క్షత్రియ మాట్లాడుతూ.. తాను బ్యానర్లో తప్పు దొర్లిన విషయం గుర్తించానని, దీనిని అధికారుల దృష్టికి తెచ్చానని చెప్పారు. ఈ పొరబాటుకు అధికారులు, అధికార పార్టీ బాధ్యత వహించాలని, జాతికి క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నేత డిమాండ్ చేశారు.