మహారాష్ట్ర సిఎం: రేసులో దేవేంద్ర, తెరపైకి గడ్కరీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనతో కూడా బిజెపి సంప్రదింపులు ప్రారంభించింది. కాగా, బిజెపితో చర్చలు జరిపేందుకు శివసేన ఇద్దరు సీనియర్ నేతలు అనిల్ దేశాయ్, సుభాష్ దేశాయ్లకు బాధ్యతలు అప్పగించింది. వీరిద్దరూ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం వీరిద్దరూ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, నడ్డాలను కలిశారు. శివనసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన బిజెపి శాసనసభాపక్ష నేత ఎన్నిక వాయిదా పడింది.
దీంతో దీపావళి తర్వాతే బిజెపి శాసనసభా పక్ష నేత ఎన్నిక జరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఆయనే ఆ పదవినే చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, మరికొందరు నేతలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరును సిఎం పదవికి సిఫార్సును చేస్తున్నారు. గడ్కరీని ప్రతిపాదించిన వారిలో ముంగంటివర్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు.
అంతేగాక కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు కూడా గడ్కరీ నివాసం వద్ద ఇందుకు మద్దతుగా నిలిచారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో తాను ఉండబోనని నితిన్ గడ్కరీ మరోసారి తేల్చి చెప్పారు. మంగళవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన అనంతరం నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శివసేన పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ నేతలు బిజెపికి సూచించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వంలో శివసేన కలిసి ఉందని, ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బిజెపి-శివసేన సంయుక్తంగా పనిచేస్తున్నాయని చెప్పినట్లు సమాచారం. బిజెపి కూడా శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ శివసేన పదవులు విషయంలో బెట్టు చేస్తే.. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్సీపి మద్దతును పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా తీసుకోవాలని బిజెపి యోచిస్తోంది.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సంప్రదించినట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ సూచన మేరకు బిజెపి.. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహారాష్ట్ర సిఎం రేసులో పలువురు ఉన్నప్పటికీ మోడీకి సన్నిహిత సంబంధాలున్న దేవేంద్ర ఫడ్నవీస్కే ఆ పదవి వరించే అవకాశాలున్నాయి.